శ్రీశైలం : వేలాది మంది భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో, సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. భక్తులు తెల్లవారు జాము నుంచే పాతాళగంగ (కృష్ణానది)లో స్నానాలు చేసి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం క్యూలైన్లలో బారులుతీరారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేసి, కేవలం అలంకార దర్శనాలు మాత్రమే కల్పించారు. ఇరుముడులతో వచ్చే శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు చేశారు. ఆలయం తెరిచినప్పటి నుంచి మూసివేసే వరకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు మజ్జిగ అల్పాహారాన్ని అందిస్తూ ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు.
అదే విధంగా కాలినడక శివస్వాములకు భక్తులకు మార్గమధ్యలో అన్నదానాలు మంచినీటిని అందిస్తున్న పలు స్వచ్ఛం సంస్థలకు దేవస్థానం ద్వారా వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలినడకన వచ్చే భక్తులకు కంకనాలు జారీ చేస్తూ.. శీఘ్ర దర్శనాలు కల్పిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. అటవీ ప్రాంతం నుండి కాలినడకతో వచ్చే వారికి వైద్యసేవలు అందించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా క్షేత్ర పరిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు భ్రామరీ కళావేదికతో పాటు శివదీక్షా శిబిరం, కోనేరు వద్ద ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో గ్రామోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో లవన్న వివరించారు.
దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన సంతోష్కుమార్ రూ.లక్ష విరాళంగా అందేశారు. సోమవారం ఆలయ పర్యావేక్షకురాలు సాయికుమారికి విరాళాన్ని చెక్కు రూపంలో అందించగా దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్ర్తాలు, ప్రసాదాలు, జ్ఞాపిక అందజేసి, సత్కరించారు.