శ్రీశైలం : ద్వాదశ జ్యోర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. కార్తీకమాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. వేకువ జాము నుంచే కృష్ణానదిలో స్నానాలు చేసి.. నదీమాతకు పసుపు కుంకుమలు సమర్పించి, నీటిలో దీపాలను వదిలారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు తెల్లవారు జామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచి, స్వామి అమ్మవార్ల నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 5 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించినట్లు ఈవో లవన్న తెలిపారు.
గర్భాలయ దర్శనాలు నిలిపివేత..
స్వామివారి గర్భాలయ, స్పర్శదర్శనాలు పూర్తిగా నిలిపివేయగా అలంకార దర్శనానికి అతిశీఘ్ర, శీఘ్ర, ఉచిత దర్శనం క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనానికి గంట సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు పాలు, మంచినీరు, అల్పాహారం అందించారు. అలాగే సాయంత్రం వరకు అన్నప్రసాద వితరణ చేశారు. గంగాధర మండపం, ఉత్తరమాఢవీధిలో పెద్ద ఎత్తున భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు.
అలరించిన నృత్య ప్రదర్శనలు
ఆలయ దక్షిణమాడవీధిలో కళారాధన వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విజయవాడ బృందం, కాకినాడకు చెందిన బాలత్రిపుర నృత్యనికేతన్ కూచిపూడి, సంప్రదాయ నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. కార్తీక మాసం వేడుకల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం పుష్కరిణి వద్ద దీపోత్సవం, దశవిధహారతులు జరిపించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. దశవిధ హారతులను దర్శించుకోవడంతో సకల శుభాలు కలుగుతాయని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు.
స్వామిఅమ్మవార్ల సేవలో ప్రముఖులు
భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్ దర్శించుకున్నారు. ఆదివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వారిని ఈవో లవన్న అర్చక వేదపండితులతో కలిసి తిలకధారణ చేసి స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్న వారికి అమ్మవారి ఆలయ ప్రాకారంలో వేదాశీర్వచనాలు చేసి, తీర్థప్రసాదాలు పరిమళ విభూదితోపాటు జ్ఞాపికను ఈవో లవన్న అందజేశారు.
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి భక్తులు రూ.లక్ష విరాళం అందించారు. గుంటూరు జిల్లా తెనాలి చెందిన శివరామ హేమంత్.. ఏఈవో హరిదాస్, సాయికుమారికి చెక్కు రూపంలో విరాళాన్ని అందించారు. దాతలకు ఉభయ దేవాలయాల్లో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక దర్శనాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు.