Vaikunta Ekadashi | హిందూ సంప్రదాయంలోని దాదాపు అన్ని పండుగలూ చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం. ‘వైకుంఠ ఏకాదశి’ పర్వదినాన్ని సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తాం. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ‘ధనుర్మాసం’ మొదలవుతుంది. ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి’, ‘ముక్కోటి ఏకాదశి’గా భావిస్తారు. ఈ రోజు ముక్కోటి దేవతలకు వైకుంఠ ద్వారంలో శ్రీ మహావిష్ణువు తన దివ్యదర్శనం అనుగ్రహించిన పర్వదినమిది. అలా వైకుంఠ ఉత్తర ద్వారంలో ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చిన విష్ణుమూర్తి ఆ మార్గంలోనే భూమికి దిగివచ్చాడనీ, మురాసురుడనే రాక్షసుణ్నీ సంహరించాడనీ పురాణ కథనం. అందుకే ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలలో భక్తులు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే సంప్రదాయం ఏర్పడింది.
ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుగాథలు వినాలి. సంకీర్తనం చేయాలి. ఆరోగ్యవంతులు ఉపవాస దీక్ష ఆచరించాలి. మనకు ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఆపై మనసును పదకొండో ఇంద్రియంగా పెద్దలు చెబుతారు. ఈ ఏకాదశ ఇంద్రియాలు మంచి మార్గంలో ప్రవర్తించటం ‘వైకుంఠ ఏకాదశి’ ముఖ్య ఉద్దేశం కావాలి. ‘కుంఠం’ అంటే లోపం. లోపం లేకుండా ఉండటం అంటే ‘వికుంఠం’.
అంటే సక్రమంగా వ్యవహరించటం. ఏకాదశ ఇంద్రియాలకు వికుంఠ స్థితిని ప్రసాదించే పర్వదినం వైకుంఠ ఏకాదశి. మనసు, ఇంద్రియాలూ, వీటి ప్రవృత్తులు కోటాను కోట్లు. ఆ మనసు సత్వ, రజ, స్తమో గుణాల ప్రకారం పని చేస్తుంది. ఆ ప్రవృత్తులను ముక్కోటి దేవతలుగా సంకేతరూపంలో సూచించారు పెద్దలు. ఈ ప్రవృత్తులన్నీ ‘ఉత్తర’ ద్వారం వెంబడి ప్రయాణించటం అంటే ‘యోగసాధన’ అని అర్థం. అలా యోగ సాధన సక్రమంగా సాగినవేళ కలిగే దివ్యానందమే హృదయంలో కలిగే విష్ణు దర్శనం. ఆనాడు జీవుడి మనః ప్రవృత్తులు ఉన్నమార్గం కన్నా ఉన్నతమైన మార్గంలో ప్రయాణిస్తాయి. అదే ఉత్- తర- ద్వార దర్శనం. ఈ అంతరార్థాన్ని గమనించి ప్రవర్తించిన వేళ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం మొక్కుబడిగా మిగిలిపోక సార్థకమవుతుంది.