తిరుమల : అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీటితో పోటెత్తుతున్నది. అటవీప్రాంతం భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహంతో మెట్లమార్గం జలపాతంలా కనిపిస్తున్నది. ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం నడకదారిని మూసివేసింది. వర్షంతో రెండో కనుమదారిలో వాహనాలు నిలిచిపోయాయి.
వైకుంఠం క్యూలైన్లోని సెల్లార్లలోకి నీరు చేరింది. వర్షానికి మాడవీధులు జలమయమయ్యాయి. భారీ వర్షంతో రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరిణికి సమీపంలో రహదారిపై చెట్టుకూలిపోయింది. కొండపై నుంచి రహదారిపైకి రాళ్లు, మట్టి కొట్టుకు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన దేవస్థానం బోర్డు చర్యలకు ఉపక్రమించింది. భారీ వర్షాల నేపథ్యంలో కనుమదారులను మూసివేసింది. వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మరో వైపు శేషాచలకొండల నుంచి తిరుపతి నగరంలోకి వరద భారీగా వస్తున్నది. తుమ్మలగుంట చెరువు కట్ట తెగిపోయింది. కల్యాణి డ్యామ్ నిండిపోవడంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. వరద ఉధృతికి వరదరాజనగర్లో వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు నీటితో నిండిపోయాయి. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో తిరుపతిలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.