తిరుపతి : తిరుపతి గోవిందరాజస్వామి(Govindaraja Swamy) వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన రథోత్సవం(Chariot) అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి, నమ్మాళ్వార్ల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. రథోత్సవంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
స్వర్ణరథంపై పద్మావతి అమ్మవారి దర్శనం
తిరుచానూరు (Tiruchanur) శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా గురువారం స్వర్ణరథంపై ఆశీనులైన అమ్మవారు భక్తులను కటాక్షించారు. పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఉంచి నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.