శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని దేవస్థానం ఈవో లవన్న సూచించారు. శనివారం ఉదయం క్షేత్ర పరిధిలో ఆలయ ముఖ్య భద్రతా అధికారి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో మాస్క్ లేకుండా తిరుగుతున్న యాత్రికులకు అవగాహన కల్పించారు.
అలాగే రూ.100 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. వారాంతపు సెలవు రోజులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం వరకు నిర్లక్ష్యంగా తిరుగుతున్న 55 మంది యాత్రికులకు జరిమానాలు విధించినట్లు అధికారులు వివరించారు.