తిరుమల : వైఎస్సార్ జిల్లాలోని శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 15న నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. ఈ సంద ర్భంగా భక్తులందరికీ తలంబ్రాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. కల్యాణం ఏర్పా ట్లపై శనివారం టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని సమావేశపు హాలులో వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎస్పీ అన్బురాజన్ తో కలిసి టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
కల్యాణవేదిక వద్ద పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రతిరోజూ అధికారుల కమిటీ సమావేశమై ఏర్పాట్లపై చర్చిస్తారని తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీ నాటికి ఏర్పాట్లు మొత్తం పూర్తవుతాయన్నారు. పార్కింగ్ ప్రదేశాలు, విద్యుత్ అలంకరణలు, బారికెడ్లు , ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.కల్యాణం రోజు సాయంత్రం 5 గంటలకు ఆలయం నుంచి స్వామి, అమ్మవారు ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు.
అక్కడ భక్తులను ఆకట్టుకునేలా అన్నమయ్య సంకీర్తనలు, త్యాగరాజ సంకీర్తనలు, తమిళనాడుకు చెందిన విఠల్దాస్ మహరాజ్ బృందం నామసంకీర్తనం నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ ఈ నెల 15న జరిగే రాములవారి కల్యాణోత్సవానికి ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు.