శ్రీకృష్ణ భగవానుడు నరుల కోసం నరుణ్నే శిష్యుడిగా చేసుకొని అనేక మానవ ప్రవృత్తి ధర్మాలను బోధించిన గ్రంథం భగవద్గీత. చెప్పింది అర్జునుడికే! కానీ, ఆచరించాల్సిన బాధ్యత ఈ ప్రపంచంలో ఉన్న మానవులది. ‘ఏ వ్యక్తి అయితే తన కోరికలను త్యజించి, మమకారాలను పక్కనపెట్టి, అహంకారానికి దూరంగా ఉండి, అన్ని స్పృహలను వదలి ప్రవర్తిస్తాడో అతడు నిజమైన శాంతిని పొందుతాడు’ అన్న కృష్ణ భగవానుడి వాక్కులలో శాంతి పొందడానికి ఎటువంటి జ్ఞానం ఉండాలో స్పష్టమవుతున్నది.
సాంఖ్యయోగంలోని చివరి శ్లోకాలలో అర్జునుడికి స్థితప్రజ్ఞత గురించి స్వామి చెప్పిన విషయాల్లో ప్రధానంగా మనిషికి మానసిక శాంతి కావాలని, అదే అతడిని స్థితప్రజ్ఞుడిగా చేస్తుందని చెప్పాడు. శాంతికి కావలసిన ప్రధాన విషయం అన్ని కోరికలకు దూరంగా ఉండటమేనన్నది ఈ శ్లోకం బోధిస్తున్న ముఖ్యమైన విషయం. లోకంలోని మానవులకు కోరికలు ఉండటం సహజం, అదేవిధంగా అహంకార మమకారాలు కూడా సహజమే. అనేకానేక విషయాల్లో ప్రవర్తిస్తుండటం మానవ నైజం. వీటన్నిటి నుంచి విడివడి శాంతిపొందే దిశగా సాగడానికి సాధన, చిత్తశుద్ధి ముఖ్యం. చిత్తశుద్ధితో సాధన చేయడానికి వివేక ప్రజ్ఞ ఉండాలి. వివేక ప్రజ్ఞ ఉన్నవ్యక్తిని ఎటువంటి శక్తి కూడా ప్రలోభపెట్టదు. ఆకర్షించదు. ఆకర్షణ, ప్రలోభం అనే లక్షణాలున్న గుణాలను తన దరిజేరనివ్వనప్పుడు, స్థిరచిత్తం కలిగి ప్రవర్తించినప్పుడు అతనికి సులభంగా శాంతి లభిస్తుంది. స్థితప్రజ్ఞత సాధించగలుగుతాడు.
మానవుడిలో నిరాశా నిస్పృహలకు కారణం ‘అలవిమాలిన కోరికలు’ అన్నది తిరుగులేని సత్యం. మనల్ని బంధించే అంశాల్లో ప్రధానమైనవి విషయస్పృహ, అహంకార మమకారాలే! అవి తొలగించుకోవడానికి పరమాత్మను ధ్యానించాలి. ఆ ధ్యానమే అతడిని ఒడ్డుకు చేరుస్తుంది. అది కేవలం సాంకేతికమే కారాదు. మనసా వాచా కర్మణా ధ్యానం చేస్తే శాంతి సాధన సులభతరమవుతుంది. నిర్మలత్వం, నిరహంకారం, వ్యక్తి మనస్సును పవిత్రం చేస్తుంది. ఆ పవిత్రత పురోగతి మార్గాన్ని నిరాటంకం చేసి సహకరిస్తుంది. దాని వల్లనే చిత్తశాంతి.
దేహభ్రాంతి కూడా మనిషి కోరికల అగ్నికి ఆజ్యం పోస్తుంది. ఏదో ఒకరోజు అదృశ్యమైపోయే ఈ భౌతిక దేహంపై మమకారం పెరిగే కొద్దీ ఆ వ్యక్తి, శాంతికి దూరమైపోతుంటాడు. అతని మనుగడ కూడా మసైపోతూ ఉంటుంది. ఎప్పుడో చనిపోయే దేహం గురించి ఇప్పుడే చనిపోవడం ప్రశాంతతను దూరం చేసుకోవడమే! ఈ ప్రపంచంలో మనం ఏదైనా పొందవచ్చు. కానీ, శాంతిని పొందడం మాత్రం కష్టమే. కనుక మానవుడు శాంతిని పొందడానికి ‘నేను’ అనే అహంకారాన్ని ‘నాది’ అనే మమకారాన్ని దూరం చేసుకోవాలని మన పురాణేతిహాసాలు అనేక రూపాల్లో బోధించాయి. శంకర భగవత్పాదుల వంటి మహనీయుల బోధనలు కూడా ఈ విషయాన్నే ధ్రువీకరించాయి.
సుఖమున్న ప్రతిచోటా శాంతి ఉంటుందని భ్రమపడరాదు. సుఖం రావచ్చు, పోవచ్చు. దానికి కూడా రాకపోకలున్నాయి. కానీ, శాంతి అనేది ఒకసారి వచ్చిందంటే ఎన్నటికీ పోదు. అందుకే శాంతినే నిజమైన సుఖంగా భగవద్గీత బోధించింది. ఇది దైవ వాక్కు. ఇది మనకు లభించడానికి జ్ఞానం కావాలి. దాన్ని సంపాదించే యత్నంలోనే మానవులు ఉండాలన్న గీతాబోధ అవశ్యం ఆచరణీయం. శాంతి ఉంటేనే సుఖం. సుఖం ఉంటేనే పరమార్థ జిజ్ఞాసకు దారి సుగమమవుతుంది. అదే స్థితప్రజ్ఞతను అందిస్తుంది. అంటే పరమాత్మ జ్ఞానమే శాంతి మూలమన్న విషయం శాశ్వత ధర్మమని, చెరపరాని సత్యమని, అదే భగవత్తత్వమని గీతాచార్యుడి బోధనలోని సారాంశం.
గన్నమరాజు గిరిజామనోహరబాబు