దివిజ గంగ భువికి దిగిన నెలవు ఒకటి.. గంగమ్మకు చెల్లిగా ఆవిర్భవించిన యమునమ్మ పుట్టినిల్లు ఇంకొకటి.. పరమేశ్వరుడి పుణ్యక్షేత్రం మరొకటి.. విష్ణుమూర్తి దివ్యధామం వేరొకటి.. అవే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ మహాధామాలు. అక్షయ పుణ్యఫలాలను ఇచ్చే ఈ నాలుగు దివ్యక్షేత్రాల సందర్శన యోగం ఆసన్నమైంది. ఈ నెల 22న అక్షయ తృతీయతో గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలు తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ క్షేత్రాల్లో దర్శనం మొదలుకానుంది. ఈ సందర్భంగా ఆ దివ్యక్షేత్రాల విశేషాలను పరికిద్దాం..
Chardham yatra | భారతావని ఆధ్యాత్మికతకు ఆలవాలం. ఇక్కడ మిన్ను, మన్ను, మాను అన్నీ పూజనీయాలే! ఈ పవిత్రస్థలిలో అణువణువూ పరమాత్మ తత్వం గోచరిస్తుంటుంది. ఆ దైవత్వం కేంద్రీకృతమైన నెలవులు తీర్థరాజాలై, పుణ్యక్షేత్రాలై అలరారుతున్నాయి. గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్నాథ్ అలాంటి దివ్య క్షేత్రాలే! ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఈ ధామాలను దర్శించుకోవాలంటే హిమాలయ సానువుల్లో దాదాపు 10 రోజులపాటు 1,200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వందల అడుగుల లోతైన లోయల పక్కగా సాహసోపేతంగా సాగే యాత్ర జీవితకాలం అనుభూతులను పంచుతుంది. బదరీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి ఈ నాలుగు క్షేత్రాల సందర్శనను చార్ధామ్ యాత్రగా పేర్కొంటారు. గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్నాథ్ దర్శనాన్ని ఛోటా చార్ధామ్ యాత్ర అంటారు. కాలక్రమంలో దీనినీ చార్ధామ్ యాత్రగా పిలుస్తున్నారు. ఏటా అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) నుంచి దీపావళి, ఆ తర్వాత రెండురోజులకు వచ్చే ప్రీతి విదియ వరకు సుమారు ఆరు నెలలపాటు ఈ క్షేత్రాలు తెరిచి ఉంటాయి. మిగతా ఆరు నెలలు అక్కడంతా మంచు కప్పేసి ఉంటుంది. ఈ నాలుగు ధామాల యాత్ర యమునోత్రి నుంచి మొదలవుతుంది. తర్వాత వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ దర్శించుకుంటారు.
పవిత్ర యుమునా నది జన్మస్థలం యమునోత్రి. ఇక్కడే యమునాదేవి ఆలయం ఉంటుంది. ఆలయానికి సమీపంలో సూర్యకుండంలో (వేడినీళ్ల కుండం) స్నానాలు చేస్తారు భక్తులు. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఇక్కడి దివ్యశిలకు (స్తంభం) ప్రత్యేక పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం యమునాదేవి యముడి సోదరి. కొన్ని కారణాల వల్ల యముడు సోదరికి దూరమవుతాడు. సోదరుడి వియోగానికి బాధపడిన యమున కన్నీరుమున్నీరుగా విలపించిందట. ఆ కన్నీరే యమునా నదిగా మారిందని చెబుతారు. హరిద్వార్ నుంచి వాహనాల్లో డెహ్రాడూన్, ముస్సోరీ మీదుగా యమునోత్రికి బయల్దేరుతారు. జానకిఛట్టి వరకు వాహనాలు వెళ్తాయి. అక్కడినుంచి 8 కిలోమీటర్లు కాలినడకన యమునోత్రికి చేరుకోవాలి. గుర్రాలు, డోలీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ దారి నయన మనోహరంగా ఉంటుంది. ఒకవైపు వేల అడుగుల ఎత్తయిన పర్వతాలు ఉంటే.. మరోవైపు ఐదారు వందల అడుగుల లోతైన లోయలు కనిపిస్తాయి. ఈ లోయల్లో యమున వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది.
ఉత్తర భారతాన్ని సస్యశ్యామలం చేసిన నదీమతల్లి గంగ. ఈ ఏడాది గంగానది పుష్కరాలు.. భగీరథి ఆవిర్భవించిన అక్షయ తృతీయనాడే మొదలవ్వడం విశేషం. భగీరథుడు తపస్సు చేసి శివుణ్ని మెప్పించి దివి నుంచి గంగను భువికి దింపింది గంగోత్రిలోనే అని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ పాలరాతితో నిర్మించిన గంగాదేవి ఆలయం చూడముచ్చటగా ఉంటుంది. నిజానికి గంగ జన్మస్థలం ఇది కాదు. ఇక్కడి నుంచి మరో 17 కిలోమీటర్ల దూరం కాలినడకన మంచు పర్వతాలను ఎక్కితే గోముఖ్ వస్తుంది. అక్కడ గోవు ముఖం రూపంలోని ఓ పర్వత పాదాల నుంచి గంగ ఉబికి వస్తూ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లాలంటే ముందుగా సైన్యం అనుమతి తీసుకోవాలి. అదీకాకుండా ఒక్కరోజులోనే వెళ్లి వెనక్కు వచ్చేయాల్సి ఉంటుంది. అందుకే సాహసికులు, పర్వతారోహకులు తప్ప మామూలు భక్తులు గోముఖ్ వరకు వెళ్లరు. జానకీఛట్టి నుంచి బార్కోట్, ఉత్తరకాశి మీదుగా వాహనాల్లో గంగోత్రి చేరుకోవచ్చు.
గంగోత్రి దర్శనం తర్వాత యాత్రికులు కేదార్నాథ్ యాత్రకు పయనమవుతారు. గంగోత్రి నుంచి ఉత్తరకాశి మీదుగా వాహనాల్లో రుద్రప్రయాగ చేరుకుంటారు. అక్కడినుంచి కేదార్నాథ్కు బయల్దేరుతారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ 11వది. ఇక్కడి శివలింగం ఎద్దు పృష్టభాగం ఆకృతిలో ఉంటుంది. గంగోత్రి నుంచి కేదార్ వెళ్లే దారిలో వచ్చే గుప్తకాశి పురాణాల పరంగా విశిష్టమైన క్షేత్రం. రుద్రప్రయాగ నుంచి వాహనాల్లో గౌరీకుండ్ వరకు వెళ్లొచ్చు. అక్కడినుంచి కేదార్నాథ్కు 14 కిలోమీటర్లు. కాలి నడకన, డోలీల్లో, గుర్రాలపై వెళ్తుంటారు. కేదార్ వెళ్లే దారి పొడవునా లోయల్లో మందాకిని నది ఉరుకులు పరుగులతో సాగిపోతూ ఉంటుంది.కేదార్నాథ్ మూడు పర్వతాల మధ్య ఉంటుంది. వాటిపైన గాంధీ సరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడి నుంచి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్నాథ్ ఆలయం చుట్టుపక్కల నుంచి కిందకు సాగి మందాకినిగా రూపుదాల్చుతాయి.
నరనారాయణ పర్వతాల నడుమ బదరీనాథ్ క్షేత్రం ఉంటుంది. ఇక్కడికి వాహనాల్లో నేరుగా వెళ్లొచ్చు. కేదార్నాథ్ నుంచి జోషిమఠ్ చేరుకొని అక్కడినుంచి బదరీనాథ్ వెళ్లాలి. ఎత్తయిన కొండల నడుమ ఉండే బదరీ నారాయణుడి ఆలయం అద్భుతంగా దర్శనమిస్తుంది. ఎత్తయిన నారాయణ పర్వతం పాదాల చెంత అంతెత్తున ఠీవిగా నిలుచుని ఉండే రంగురంగుల గోపురం భక్తులను ఆకట్టుకుంటుంది. పలు ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు భోజన, వసతి సదుపాయాలు లభిస్తాయి. బస్సులు, వాహనాలు నేరుగా బదరీధామానికి చేరుకుంటాయి. నారాయణుడిని దర్శించుకోవడంతో చార్ధామ్ యాత్ర ముగుస్తుంది. అక్కడినుంచి యాత్రికులు హరిద్వార్ గానీ, రుషికేశ్ గానీ చేరుకొని తిరుగుప్రయాణం అవుతారు.
ఏప్రిల్ 22 యమునోత్రి, గంగోత్రి
ఏప్రిల్ 25 కేదార్నాథ్
ఏప్రిల్ 27 బదరీనాథ్
…? మానస్