ఆశించినంత పంట రాకపోవడంతో ఓ రైతు మానసిక అశాంతికి గురయ్యాడు. తన భర్త ఆందోళన పడుతున్నాడని ఆ రైతు భార్య గుర్తించింది. అయ్యప్ప మాల ధరించి నలభై రోజుల మండల దీక్ష చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని సలహా ఇచ్చింది. అప్పటికే గ్రామంలో చాలామంది రైతులు దీక్ష తీసుకుని గుడివద్ద భజనలు చేస్తున్నారు. దీక్ష గురించి తెలుసుకుందామని స్వాములను కలిశాడు. వారు రైతు నిర్ణయాన్ని స్వాగతిస్తూ చెడు అలవాట్లకు, విలాసాలకు దూరంగా ఉండాలన్నారు. వస్త్ర నియమం పాటిస్తూ చన్నీటి స్నానం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం లాంటి నియమాలు పాటించాలన్నారు. అన్నిటికీ అంగీకరించిన రైతును గురుస్వామి దగ్గరికి తీసుకు వెళ్లారు. ‘మాలధారణ చేయాలని ఉంది. చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందా?’ అని అడిగాడు రైతు గురుస్వామిని.
ఆ ప్రశ్నకు స్పందిస్తూ.. చిరునవ్వుతో ‘రైతువైన నీవు ఏ నమ్మకంతో పంటలను పండిస్తావు?’ అని అడిగాడు గురుస్వామి. ‘మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయనే నమ్మకంతో!’ అని బదులిచ్చాడు రైతు. ‘విత్తనాలు ఎలాంటివో, ఎప్పుడు వర్షాలు కురుస్తాయో తెలియదు. ఏ చీడ పడుతుందో, ఎంత దిగుబడి వస్తుందో తెలియదు. బాగా పండినా మంచి ధర పలుకుతుందో లేదో కూడా తెలియదు. కానీ పంటలు పండిస్తున్నావు. అంటే.. అంతా మంచే జరుగుతుందని నమ్ముతున్నావు. అదే నమ్మకం దేవుడి మీద కూడా పెట్టు. మంచి ఫలితాలు పొందుతావు’ అని వివరించాడు గురుస్వామి. ‘నిజమే. ఏదైనా నమ్మకంతో చేయాలి. భూమిపై ఎక్కడ తవ్వినా నిధి దొరుకుతుంది, అయితే రైతుకు ఉండే విశ్వాసం తవ్వేవాడికి ఉండాలని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా’ అని మాలధారణకు ఉపక్రమించాడు రైతు.
…?ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821