ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) సతీమణి హజ్రత్ ఆయిషా (రజి) దగ్గరికి ఒక మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను వెంటపెట్టుకొని వచ్చింది. ఎన్నో రోజులుగా పస్తులున్నామని తన ఆకలి బాధను తెలియజేసిందా మహిళ. ఆ సమయానికి ఆయిషా (రజి) ఇంట్లో తినడానికి ఏమీలేవు, ఒకే ఒక్క ఖర్జూరం పండు తప్ప. ఆ ఖర్జూరాన్ని ఆయిషా (రజి) ఆమెకు అందించారు. ఆ మహిళ అందుకొని, రెండు సమాన భాగాలు చేసి, తన ఇద్దరు కూతుళ్లకు పంచి, తాను మాత్రం పస్తులుండిపోయింది. తన భర్త ముహమ్మద్ (స) ఇంటికి రాగానే ఈ వృత్తాంతాన్ని వినిపించారు ఆయిషా (రజి). అప్పుడు ప్రవక్త (స) ఆ మహిళ త్యాగాన్ని ఎంతగానో ప్రశంసించారు. “తాను పస్తులుండి తన బిడ్డల ఆకలి తీర్చిన ఆ మహిళకు ఆ ఆడపిల్లలే నరకానికి అడ్డుగోడలవుతారు.
స్వర్గానికి బాటలవుతార’ని చెప్పారు. ఇద్దరు లేక ముగ్గురు ఆడపిల్లలను పెంచి పోషించి.. వారికి సరైన విద్యాబుద్ధులు నేర్పించి మంచి వరుడికిచ్చి పెళ్లి జరిపిస్తే .. అలాంటి తల్లిదండ్రులు స్వర్గానికి వారసులవుతారని ప్రవక్త చెప్పారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపేవారికి, ఆడపిల్లల్ని గుండెలమీద కుంపటిగా భావించే వారికి, ఆడపిల్లల్ని కడుపులోనే చిదిమేసే వారికి ఈ సంఘటనలు కనువిప్పు. ప్రవక్త (స) తన నలుగురు కుమార్తెలను ఎంతో ప్రేమాదరణలతో పెంచి పెద్ద చేశారు. బయటి నుంచి ఇంటికి రాగానే వారి చేతులను ముద్దాడేవారు. ఇంట్లో మగపిల్లలు, ఆడపిల్లలు కనుగ ఉంటే.. ఇద్దరినీ సరిసమానంగా పెంచమన్నారు. ఎలాంటి వివక్ష చూపొద్దన్నారు.
ఏదైనా వస్తువు, కానుక ఇంటికి తీసుకువస్తే ముందు ఆడపిల్లలకే ఇవ్వాలన్నారు. అవనిలో మహోన్నతమైన జన్మ ఆడజన్మ.. అమ్మగా స్వర్గం ఆమె పాదాక్రాంతం.. ఆలిగా ఆమె సేవలు, త్యాగాలు అనిర్వచనీయం. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆడ బిడ్డలు ఇంటికే కాదు అవనికే వెలుగులు. బేటీ రోటీ.. అని ఊరకే అనలేదు. మొదటి సంతానం ఆడబిడ్డ పుడితే ఇక ఆ ఇంట్లో శుభాల వర్షం కురిసినట్లే. అందుకే, అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో మహిళలకోసం ప్రత్యేక అధ్యాయమే కేటాయించారు. పవిత్ర ఖుర్ఆన్ ప్రతిని తెరచి చూస్తే నాలుగో అధ్యాయంగా ‘నిసా’ మనకు కనిపిస్తుంది.
‘నిసా’ అంటే మహిళ అని అర్థం. ఈ అధ్యాయంలో బోధనలన్నీ మహిళలకే ప్రత్యేకం.
…? ముహమ్మద్ ముజాహిద్
98482 83208