లోకంలోని మిగతా ప్రాణులతో పోలిస్తే.. మనిషి భిన్నంగా ఉంటాడు. విభిన్నంగా ఆలోచిస్తాడు. వినూత్నంగా వ్యవహరిస్తాడు. తన అవసరాల కోసమే సృష్టి అంతా జరిగిందనీ, అన్నిటికీ తనే మూలమని భావిస్తాడు. శస్ర్తాలు, శాస్ర్తాలూ తన అభివృద్ధి కోసమే అనుకుంటాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని చేరడానికి అనువైన మార్గాన్ని అన్వేషిస్తుంటాడు. ఈ అన్వేషణ క్రమంలో మన పూర్వికులు కాలానుగుణంగా కొన్ని ఆచారాలు స్థిరీకరించారు. వేదాంగమైన జ్యోతిష శాస్ర్తాన్ని ఆలంబనగా చేసుకున్నాడు. ‘జ్యోతిషామయనం చక్షుః’ అన్నారు. అంటే జ్యోతిషం వేదానికి కండ్ల వంటిదని చెప్పారు. ధర్మాచరణకు జ్యోతిషం ప్రధానమైనది. దాని ఆధారంగానే కాలక్రమంలో జరిగే మార్పులకు అనుగుణంగా, సాధనకు వీలుగా రుషులు మార్గనిర్దేశం చేశారు.
‘ఉపాధి భేదాత్ ఏ కోపి భవేత్కాలోప్యనేకథా’
అని కాలాన్ని విశ్లేషించింది శాస్త్రం. అంటే ఉపాధి భేదంతో నిమిషాలు, గంటలు, రోజులు (తిథులు), పక్షాలు, నెలలు, రుతువులు, అయనాలు, సంవత్సరాలుగా కాలాన్ని నిర్ణయించారు.
‘అయతే యాతి అనేన రుతుత్రయేణ సూర్యః దక్షిణాశాం, ఉత్తరాశాం చేతి రుతుత్రయం అయనం’
అని అయనాలను విశ్లేషించారు. అంటే, సూర్యుడు భూమికి దక్షిణ దిశలో సంచరించే మూడు రుతువుల (ఆరు నెలలు) కాలాన్ని దక్షిణాయనమనీ, భూమికి ఉత్తరదిశలో సంచరించే మూడు రుతువుల కాలాన్ని ఉత్తరాయణమని పేర్కొన్నారు. సూర్యుడు మేషరాశి మొదలుకొని ప్రతినెలా ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. సూర్యుడు మకరంలోకి ప్రవేశించింది మొదలు మిథునం దాటే వరకుగల ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణం అని, కర్కాటక సంక్రమణం మొదలు ధనుస్సు దాటే వరకూ ఉన్న ఆరునెలల కాలాన్ని దక్షిణాయనం అని విభజించారు. ఉత్తరాయణ, దక్షిణాయనాలు వేటికవే ప్రత్యేకమైనవి. ఉత్తరాయణం పుణ్యకాలమనీ, దక్షిణాయనం అంటే మామూలు సమయం అనే అపోహ చాలామందిలో ఉంది.
శాస్త్ర ప్రకారం అన్ని కాలాలూ యోగ్యమైనవే! అన్నీ ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైనవే. ఉత్తరాయణం శుభకార్యాలకు అనువైనదైతే.. దక్షిణాయనం ఉపాసకులు అనుష్ఠానం చేసుకోవడానికి విశేషమైనదిగా చెబుతారు. ఉత్తరాయణంలో శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి తదితర పర్వాలు పలకరిస్తే.. దక్షిణాయనంలో శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన షణ్మత దేవతా ఉపాసనలు, అనుష్ఠానాలు ఎన్నో మనకు గోచరిస్తాయి. శ్రీశంకరాచార్యులు స్థాపించిన శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సౌర, స్కాంద అనే ఆరు మతాలను స్థాపించి మానవ కల్యాణ కారకాలైన అనేక ఉపాసనా మార్గాలను బోధించారు. ఈ అనుష్ఠాన సాధనలన్నీ దక్షిణాయనంలో ఉండటం విశేషం.
శ్రావణం శైవం
సాధారణంగా ఆషాఢ శుక్ల పక్షంలోనే దక్షిణాయన ప్రవేశం జరుగుతుంటుంది. వ్యాసపౌర్ణమి గురుపూజతో సాధన ప్రారంభమవుతుంది. ‘శ్రావణః శివరూపకః’ అంటుంది శాస్త్రం. శివరూపమైన శ్రావణంలో శైవక్షేత్రాల్లో విశేష అభిషేకాలు జరుగుతాయి. ఇంటింటా శివుడిని ఆరాధించడం చూడొచ్చు. ఈ విధంగా శ్రావణమంతా శైవోపాసన విశేషంగా కొనసాగుతుంది. తమ ఇంట్లోనే బారసాల అవుతున్నంత సంబురంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకొంటారు. ఆడబిడ్డలు ఆచరించే మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, అన్నదమ్ముల మేలు కోరి చేసే నాగులపంచమి, రక్షాబంధన్ ఉత్సవాలు ఆనందాలు పంచుతూనే భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి. ఉపనయన సంస్కారం ఉత్తరాయణంలో చేసినప్పటికీ శ్రావణ పౌర్ణమినాడు ఉపాకర్మ చేస్తారు. అలా దక్షిణాయనంలోనే వేదాధ్యయనం ఆరంభమవుతుంది.
భాద్రపదం.. గాణాపత్యం
‘చతుర్థ్యాం సర్వవర్ణైస్థెః భాద్రేపూజ్యో గజాననః’ అని భాద్రపద శుక్ల చతుర్థి నుంచి భారతావనిలో ఆబాలగోపాలమూ ఇంటింటా వీధివీధినా గణపతి ఉత్సవాలను చేసుకుంటారు. వినాయక నవరాత్రుల్లో ఏకదంతుడికి విశేష ఆరాధనలు చేస్తారు. అంతేకాదు, ఈ నెలలోనే అనంత చతుర్దశి, వామన జయంతి పర్వదినాలూ ఆధ్యాత్మిక శోభను పంచుతాయి. ముఖ్యంగా రుణత్రయాల్లో ఒకటైన పితృరుణ విముక్తికి భాద్రపద కృష్ణ పక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృ తర్పణాలు నిర్వహించడం సంప్రదాయం.
ఆశ్వయుజం అమ్మకు (శాక్తం)
‘శరత్కాలే మహాపూజా క్రియతే యాచవార్షికీ’ అని శాక్తేయులు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి వివిధ రూపాల్లో, వివిధ సంప్రదాయాల్లో అమ్మవారిని సేవిస్తారు. మన రాష్ట్రంలో శ్రీచక్ర స్వరూపిణి అయిన జగన్మాతను పూలతో బతుకమ్మగా పేర్చి పదిరోజులపాటు ఆటపాటలతో ఆరాధిస్తారు. దేవీ నవరాత్రులు శాక్తేయ సాధకులకు ముఖ్యమైనవిగా చెబుతారు. అనుక్షణం అమ్మను ఆరాధిస్తూ తపోశక్తిని ప్రోది చేసుకుంటారు. ఆశ్వయుజ అమావాస్య దీపావళి ఉత్సవమూ భక్తి ప్రధానమైనదే. దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే సంప్రదాయం మనది. లక్ష్మీపూజలు విశేషంగా చేసుకుంటారు. మొత్తంగా ఆశ్వ యుజం శక్త్యుపాసనకు ప్రధానం.
శివం.. కేశవం.. కార్తికం
కార్తిక మాసం శివ, కేశవుల మాసంగా చెబుతారు. ఈ నెలలో అభిషేకాలతో శివుడిని కొలిస్తే, అర్చనలతో దామోదరుడిని సేవిస్తారు. నిత్య రుద్రాభిషేకాలు, కేదారేశ్వర వ్రతాలు, వన భోజనాలు ఇలా కార్తిక మాసమంతా భక్తి ఉద్యమంలా సాగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.
హరి మాసం.. మార్గశిరం (వైష్ణవం)
‘మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీకృష్ణుడు స్వయంగా తానే మార్గశిర మాసమని భగవద్గీతలో పేర్కొన్నాడు. ఈ నెలలో విష్ణు ఉపాసన విశేషంగా కొనసాగుతుంది. అంతేకాదు, కార్య విముఖుడైన అర్జునుడిని ఉద్ధరించడానికి కృష్ణ భగవానుడు గీతోపదేశం చేసిన మహత్తరమైన మాసం కూడా ఇదే. అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్త మానవజాతికీ భగవంతుడు ఇచ్చిన సందేశమే భగవద్గీత.
స్కాందం.. వందనం
మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ చేసుకుంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం ఇదే. యోగ సాధనలోని షట్చక్రాలకు షణ్ముఖుడి ఆరు ముఖాలూ ప్రతీకలుగా చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పేదలకు దుప్పట్లు, కంబళ్లు దానం చేసే ‘ప్రావరణ వ్రతం’ నిర్వహించే సంప్రదాయమూ ఉంది.
సూర్యం ప్రణమామ్యహం (సౌరం)
ప్రతి రోజూ అందరూ దర్శించుకునే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఉత్తరాయణంలో ప్రచండంగా ఉండే భానుడి ప్రభావం దక్షిణాయనం కొనసాగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. దానికి తగ్గట్టుగానే మనుషుల్లో రోగనిరోధకశక్తీ తగ్గుతుంటుంది. అందుకే, ఈ ఆరుమాసాలు మన పెద్దలు పలు వ్రతాలు, పండుగలతో జీవన విధానాన్ని క్రమబద్ధీకరించారు. ఈ కాలంలో సూర్యోపాసన విశేష ఫలితాన్ని ఇస్తుంది. నిత్యం సూర్య నమస్కారాలు చేయడం ఆరోగ్యానికీ మేలుచేస్తుంది.
‘అత ఏవ దేవాశ్చ మునయో నాగాః
గంధర్వా గుహ్యకాస్తథా
ధార్మికం పూజయంతీ హ
న ధనాఢ్యం న కాముకం’
దక్షిణాయనంలో చేసిన శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సౌర, స్కాంద అనుష్ఠానాలు, ఆరాధనలు, ఉపాసనల వల్ల ధార్మికులైన మానవులను దేవతలు, మహర్షులు తదితరులు పూజిస్తారని మన శాస్ర్తాలు పేర్కొన్నాయి.
శాస్ర్తుల వేంకటేశ్వరశర్మ
శ్రీ బగలాముఖీ శక్తి పీఠం, శివంపేట.
98499 09165