‘వాయుర్వావ సంవర్గో’ వాయువే చిట్టచివరి ఆశ్రయం. సంవర్గం అంటే అన్నిటినీ తనలో విలీనం చేసుకోవడం. ఛాందోగ్య ఉపనిషత్తులో కింది వృత్తాంతం కనిపిస్తుంది. మహావృష రాజ్యాన్ని పాలించే జానశ్రుతి మహారాజు ఎన్నో అన్నదానాలు చేశాడు. అతనికి తనంతవాడు లేడనే అహం! ఒకనాడు మేడమీద విశ్రమిస్తుంటే రెండు హంసలు ఎగురుతూ మాట్లాడుకుంటున్నాయి.
ఒక హంస ‘జానశ్రుతి వంటి ధర్మరాజు లేడు’ అన్నది. మరో హంస నవ్వి ‘బండి తోలుకునే రైక్వుడు లేడా! జానశ్రుతి ధర్మకార్యాలన్నీ కీర్తి కోసమే కదా!’ అన్నది. హంసల మాటలు విన్న రాజు చిన్నబోయాడు. మర్నాడు రైక్వుడిని వెతికి తెమ్మని ఒక భటుణ్ని పంపాడు. దొరకలేదని తిరిగి వచ్చిన భటుడితో ‘యోగులుండే ప్రదేశాల్లో వెతకమ’ని కసిరాడు జానశ్రుతి. మొత్తానికి ఒక మారుమూల పల్లెలో రైక్వుడు కనిపించాడు. అతని దర్శనార్థం రాజు పరివారంతో వెళ్లాడు. వెంట ఎన్నో కానుకలు తీసుకెళ్లాడు. ప్రశాంతంగా ఉన్న రైక్వునికి నమస్కరించాడు రాజు. కానుకలు తీసుకోమన్నాడు.
‘వీటితో ఆత్మజ్ఞానాన్ని కొందామనుకున్నావా రాజా! అది అమ్ముడుపోయేది కాదు’ అన్నాడు రైక్వుడు. మారుమాట్లాడక రాజు రాజధానికి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు రాజుకు మళ్లీ రైక్వుడిని చూడాలనిపించింది. ఈసారి నిరాడంబరంగా ఒక్కడే వెళ్లాడు. ఆత్మజ్ఞానం గ్రహించడానికి రాజు అర్హుడని భావించిన రైక్వుడు అతనికి ‘సంవర్గ విద్య’ను అనుగ్రహిస్తూ.. ‘దానాలు చేయి. కానీ, గర్వపడకు. నా ప్రయోజకత్వమే అనుకోకు. అది అహం.. నాశనం చేస్తుంది.
కీర్తి కాంక్షతో దానం చేయకు. పరమాత్ముడు నాకు అందించిందే దానం చేస్తున్నా అనుకో. అది నీ కర్తవ్యంగా భావించు. ఆత్మానుభూతి లభిస్తుంది’ అని ఉపదేశించాడు. రాజు ఎంతో ఆనందించాడు. బంగారు నాణేలతో, రథాలతోపాటు తన కుమార్తెను భార్యగా స్వీకరించాల్సిందిగా రైక్వుడిని ప్రార్థించాడు. దానికి ఆయన ఒప్పుకొన్నాడు. అతను నివాసమున్న పల్లె
‘రైక్వపర్ణ’మని ప్రసిద్ధి చెందింది.
..?డా॥ వెలుదండ సత్యనారాయణ