పాపులు, పుణ్యాత్ములు మరణించే సమయంలో పొందే అనుభవాన్ని ముహమ్మద్ ప్రవక్త (స) ఒక సందర్భంలో ఇలా వివరించారు. మనిషికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు అతని ప్రాణాన్ని తీసుకుపోవడానికి దైవదూతలు ప్రత్యక్షమవుతారు. శరీరం నుంచి ఆత్మను వేరుచేసి ప్రభువు దగ్గరికి తీసుకెళ్తారు. మంచి జీవితం గడిపిన పుణ్యాత్ముల ప్రాణం తీయడానికి సాధు స్వభావం కలిగిన ముఖవర్చస్సు, కాంతిమంతమైన శ్వేత వస్ర్తాలు ధరించిన మృత్యుదూతలు వస్తారు. ప్రాణాలు కోల్పోతున్న ఆ వ్యక్తిని మృధువుగా పలకరిస్తారు.
‘ఓ పవిత్రమైన ఆత్మగలవాడా, నీ ప్రభువు వద్దకు వెళ్దాం పదా! నీ పట్ల ప్రభువు సంతృప్తిగా ఉన్నాడు’ అంటూ దేహం నుంచి ఆత్మను వేరు చేస్తారు. పుణ్యాత్ముడి ఆత్మనుంచి సువాసనలు వెదజల్లుతుంటాయి. అల్లాహ్ ఆజ్ఞతో ఆత్మను విశ్వాసుల జాబితాలో రాస్తారు. విశ్వాసుల ఆత్మలుండే ఇల్లీయీన్ ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడ ఆత్మ ప్రశాంతంగా సేద తీరుతుంది. అదే పాపాత్ముల ప్రాణాలు తీయడానికి వచ్చే మృత్యుదూతలు వికృతరూపాలలో కనిపిస్తారు. వీరి ఆత్మల నుంచి దుర్గంధం వస్తుంది. ప్రాణం తొలగించిన తర్వాత ఆ ఆత్మను ఆకాశంలోకి తీసుకెళ్లి బోర్లాపడవేస్తారు. ఇలాంటి వారి ఆత్మలను సిజ్జీయీన్ల జాబితాలో రాస్తారు. ఇలాంటి ఆత్మలకు నిత్యయాతన ఉంటుంది.
…? ముహమ్మద్ ముజాహిద్, 9640622076