శరన్నవరాత్రులలో ఐదో రోజున అమ్మవారిని స్కందమాతగా అలంకరించి ఆరాధిస్తారు. ‘స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః’ శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తనయుడికి స్కందుడు అని పేరు. ఈయనకే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని పలు పేర్లున్నాయి. స్కందుని తల్లికావడంతో అమ్మవారికి ‘స్కంద మాత’ అని పేరు. నవదుర్గలలో ఇది ఐదో రూపం.
సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥
స్కందమాత వాహనం సింహం. తెల్లని రంగుతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. నాలుగు చేతులు, మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. తన కుమారుడైన బాలస్కందుడిని ఒక చేతితో ఎత్తుకొని, రెండు చేతుల్లో పద్మాలు ధరించి, మరో చేతితో అభయమిస్తూ కనిపిస్తుంది. స్కందమాత సకల శుభాలనూ అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో, మానసిక ఏకాగ్రతతో, నిస్వార్థంగా ఆరాధించే భక్తుల హృదయాలను పవిత్రం చేసి, వారికి ఇహపర సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది. కుమారస్వామిని ఎత్తుకొని ఉండటం వల్ల.. ఈ తల్లిని పూజించే క్రమంలో స్కందుడి అనుగ్రహమూ లభిస్తుంది. కుమారస్వామి శక్తియుక్తులను ప్రసాదిస్తాడు. స్కందమాతను అగ్నికి అధిష్ఠాన దేవతగా, ప్రాకృతిక శక్తిగా, కాలస్వరూపిణిగా, విశ్వజననిగా ఆరాధిస్తారు సాధకులు.
సతీదేవి దక్షప్రజాపతి కూతురు. పరమేశ్వరుడి ఇల్లాలు. తండ్రి తలపెట్టిన నిరీశ్వర యాగానికి భర్త వారిస్తున్నా వెళ్తుంది. పుట్టింట నిరాదరణకు గురికావడంతో కోపంతో సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుంది. సతీ వియోగంతో రగిలిపోయిన శివుడు.. వీరభద్రుడిని సృష్టిస్తాడు. ఆయన దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. పరమేశ్వరుడు సతీ విరహంలో కూరుకుపోతాడు. ఇదే సమయంలో తారకాసురుడు ఘోర తపస్సు చేసి శివుడికి పుట్టిన కొడుకు (శివుడికి సంతానం కలగదనే ఉద్దేశంతో..)
వల్ల తప్ప తనకు మరణం లేకుండునట్లుగా వరం పొందుతాడు. వర గర్వంతో సజ్జనులను పీడిస్తూ ఉంటాడు. మరోవైపు సతీదేవి హిమవంతుడికి కూతురుగా జన్మిస్తుంది. ఆమె శివుడి గురించి ఘోర తపస్సు చేస్తుంది. తపస్సులో ఉన్న శివుడిలో కదలిక తేవడానికి దేవతలంతా కలిసి మన్మథుణ్ని ప్రేరేపిస్తారు. మన్మథుడు పూలబాణం సంధించి శివుడి కోపాగ్నికి గురవుతాడు. కానీ, శివుడి దృష్టి పార్వతిపై పడుతుంది. ఇదే అదనుగా సప్తర్షులు, ఇతర దేవతలు కలిసి శివపార్వతుల కల్యాణం జరిపిస్తారు.
వివాహానంతరం శివపార్వతులు కైలాసంలో కేళీ వినోదాలతో కాలం గడుపుతుంటారు. మరోవైపు తారకాసురుడి ఆగడాలు మితిమీరుతాయి. తమను రక్షించమని దేవతలంతా కైలాసానికి వెళ్తారు. దేవతల తొందరపాటుతో శివతేజస్సు పార్వతిలో కాకుండా కిందికి జారిపోతుంది. ఆ తేజస్సును కొంతకాలం అగ్ని భరిస్తాడు. కానీ, ఆ శక్తిని తట్టుకోలేక దాన్ని గంగలో వదిలేస్తాడు. గంగ కూడా భరించలేక దాన్ని భూమిపై రెల్లు పొదల్లోకి తోసేస్తుంది. ఆ తేజస్సు నుంచి ఓ బాలుడు జన్మిస్తాడు. ఆరుగురు కృత్తికలు ఆ పసివాడిని పెంచుతారు. తల్లులందరి దగ్గరా పాలు తాగడానికి వీలుగా ఆరు ముఖాలతో ఆవిర్భవించి షణ్ముఖుడు అయ్యాడు. కృత్తికలు పెంచారు కనుక కార్తికేయుడు. శివతేజస్సు జారడం వల్ల పుట్టినవాడు కావడంతో స్కందుడు. ఇలా రకరకాల పేర్లతో పిలిచారు. శక్తిమంతుడు, ప్రజ్ఞావంతుడైన స్కందుడిని తమ సేనానిగా చేసుకుంటారు దేవతలు. మహాసేనతో తారకాసురుణ్ని సంహరించి లోక కల్యాణం చేశాడు కుమారస్వామి. కుమారుడికి శక్తి ఆయుధాన్ని అనుగ్రహించిన స్కందమాత.. తనను కొలిచే భక్తులకు శక్తియుక్తులను ప్రసాదిస్తుంది. దేవదానవ సంహారంలో స్కందమాత రూపంలో అనేకమంది రాక్షసులను సంహరించింది. నవరాత్రుల వేళ.. స్కందమాత ఆరాధన విశేష ఫలాలనిస్తుంది.
దోర్బల ,కుమారస్వామి