రామరాజ్యం కావాలని అందరూ కోరుకుంటారు. సుఖమయ, ఆనందమయ జీవితానికి రామరాజ్యం చక్కని స్థానం అని అందరి నమ్మకం. యుగాలు మారినా రామరాజ్య వైభవం ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. రామరాజ్య ప్రశస్తి శ్రీరాముడి యశస్సుకు చిహ్నం. ఐశ్వర్యం, బలం, యశస్సు, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు విభూతులను సంపూర్ణంగా కలిగినవాడే భగవంతుడు. అయితే భగవంతుడు ఆయా సందర్భాల్లో ఏదేని అవతారాన్ని స్వీకరించినప్పుడు, తన అన్ని విభూతులను ప్రదర్శించవలసిన అవసరం ఉండదు. సందర్భానికి తగ్గట్టుగా ఆయా విభూతులను ప్రకటిస్తుంటాడు. శ్రీమన్నారాయణుడు యశస్సు అనే విభూతిని ప్రదర్శించిన అవతారాలు రెండు. అవే శ్రీరామావతారం, ధన్వంతరి అవతారం. అందుకే వీరి యశస్సు శాశ్వతం. శ్రీరాముడి యశస్సుకు రామసేతువు గొప్ప నిదర్శనం. భక్తులకు భక్తిదాయకం, ఆనందప్రదం. తనను దాటడానికి ఏ అడ్డూ లేకపోయినప్పటికీ భావితరాలు, యుగయుగాలు యశస్సు నిలిచిపోయేలా సేతువును నిర్మించమని సముద్రుడే శ్రీరామునితో పలికాడు.
బధ్నీహిసేతుమిహతే యశసో వితత్యై నాధి వ్యాధిజరా గ్లాని దుఃఖశోక భయక్లమాః
మృత్యుశ్చానిచ్ఛతాం నాసీద్ రామే రాజన్యధోక్షజే’ (భాగవతం)
పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు త్రేతాయుగ ధర్మ ప్రకారం యజ్ఞాలు నిర్వహించాడు. ఆ సందర్భంగా తన రాజ్య సర్వస్వాన్నీ యజ్ఞ నిర్వాహకులైన రుషులకు సమర్పించాడు. తద్వారా రుషులపై అపార గౌరవాన్ని ప్రదర్శించాడు. వారంతా ఆ రాజ్యాన్ని శ్రీరాముడికే తిరిగి అప్పగించి రాజుపై తమ ప్రేమాభిమానాలు చాటుకున్నారు. అయోధ్య వాసులందరూ శ్రీరామచంద్రుడిని తండ్రిగా భావించేవారు. ఆయనపై అపారమైన గౌరవాన్ని ప్రదర్శించేవారు. రాముడు కూడా తన రాజ్య ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన పాలనలో ప్రకృతి కూడా తన ధర్మాన్ని కచ్చితంగా నిర్వర్తించేది. అరణ్యాలు, నదులు, పర్వతాలు, గిరులు, ద్వీపాలు, సముద్రాలు సమస్త జీవులకు అవసరమైన జీవితావసరాలన్నింటినీ ఇచ్చేవి.
ప్రజలకు మానసిక బాధలుండేవి కావు. శారీరక సమస్యలు వచ్చేవి కావు. వ్యాధుల పీడ ఉండేది కాదు. వృత్తి, వ్యాపారాల్లో నష్టమనే మాటే ఉత్పన్నమయ్యేది కాదు. దుఃఖం, శోకం, భయం, అలసట ఏ మాత్రం కలిగేవి కావు. రామరాజ్యంలో కోరని వారికి మృత్యువు కూడా వచ్చేది కాదని భాగవతం పేర్కొన్నది. పేద, ధనిక అనే తారతమ్యం ఉండేది కాదు. అందరూ సమభావంతో మెలిగేవారు. అందుకే రామరాజ్య వైభవం, మహిమ.. యుగాలు మారినా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. సిరి సంపదలు, సుఖసంతోషాలతో, సత్యధర్మాలతో తులతూగే రామరాజ్యంలో ఉండాలని కోరుకోని వారెవరు ఉంటారు? శ్రీరాముడి ధర్మాచరణే అయోధ్యను ఉన్నతంగా తీర్చిదిద్దింది. రాజ్యంలోని ప్రజలంతా రాముడిని తండ్రిగా భావిస్తూ, అందరం ఆయన బిడ్డలమే అనే భావనతో కలసిమెలసి జీవనం సాగించేవారు. చివరికి ఆ దివ్యపురుషుడితో పాటుగా అయోధ్యవాసులంతా సాకేత ధామానికి చేరుకున్నారు.
శ్రీరామచంద్రుని చరితం మంగళకరం. ఎవరైతే రామకథను త్రికరణశుద్ధిగా వింటారో వారు మాత్సర్య రోగం నుంచి విడివడతారు. ఈర్ష్యారోగం నుంచి బయటపడేవాళ్లు శీఘ్రమే భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. దివ్యశక్తి సంపన్నులై అద్భుతమైన కార్యాలను జీవితంలో సాధించి, జన్మను సార్థకం చేసుకుంటారు. రామరాజ్యం ఎంతగా సుప్రసిద్ధమో శ్రీసీతారామ కల్యాణం కూడా అంతే సుప్రసిద్ధం. ఇదంతా ఆ దేవదేవుడు ప్రదర్శించిన యశస్సు మహిమ!
డా॥ వైష్ణవాంఘ్రిసేవక దాస్
98219 14642