ఆకాశదీపం అంటే ఏమిటి? దాని ప్రాశస్త్యం వివరించండి?
– వి.పుష్ప, నిజాంపేట్
దామోదరాయ నభసి తులాయాం దోలయా సహ
ప్రదీపంతే ప్రయచ్ఛామి నమోనంతాయ వేధసే॥
‘సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు దామోదరుడైన విష్ణుమూర్తి కోసం ఆకాశదీపాన్ని వెలిగించాలి’ అని శాస్త్ర వచనం. కార్తిక మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత శివాలయాల్లో, వైష్ణవాలయాల్లో ఆకాశదీపం ఏర్పాటుచేసే సంప్రదాయం ఉంది. మట్టితో గానీ, లోహంతో గానీ చేసిన చిల్లులు ఉన్న ప్రమిదలో ఆవునెయ్యితో గానీ, నువ్వులనూనెతో గానీ ఆకాశదీపాన్ని వెలిగిస్తారు.
దీనిని ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు. ‘దామోదరమావాహయామి’, ‘త్రయంబకమావాహయామి’ అని శివకేశవులను ఆహ్వానిస్తూ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపకాంతులు హరిహరుల తేజస్సును ప్రసరింపజేస్తాయని విశ్వసిస్తారు. కార్తిక మాసంలో ప్రతిరోజూ గుడికి వెళ్లి ఆకాశదీపాన్ని దర్శించుకొని, దీపాలు వెలిగించిన వారికి జ్ఞానసంపద కలుగుతుందని స్కాంద పురాణ అంతర్గతమైన కార్తిక పురాణం చెబుతున్నది.
కార్తిక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలు ఆకాశమార్గంలో తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. వారికి దారి చూపేందుకు వీలుగా ప్రతి గృహస్థూ ఇంటికి దక్షిణ దిశలో దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతున్నది. ఈ దీపాల వెలుగు వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని నమ్మకం.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370