ఒక పట్టణంలో బాగా రద్దీగా ఉన్న ప్రదేశంలో ఓ హోటల్ ఉండేది. వ్యాపారం బాగానే జరుగుతున్నా ఆ హోటల్ యజమాని, డబ్బు దగ్గర చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. ఒక్క రూపాయి తక్కువైనా భోజనం వడ్డించే వాడు కాదు. ఏరోజుకారోజు మిగిలిన వంటలను కాలువల్లో పోసే వాడు కానీ, భిక్షగాళ్లకు ఒక్క మెతుకు కూడా విదిలించేవాడు కాదు. ఆ దారిలో ఉన్న ఓ ఆసుపత్రికి ఒక నర్సు రోజూ వెళ్లేది. డ్యూటీకి పోయే ప్రతిసారీ ఆమె ఆ హోటల్కి క్రమం తప్పకుండా వచ్చేది.
రెండు భోజనం ప్యాకెట్లు తీసుకెళ్లేది. ‘డ్యూటీకే కదా ఆమె వెళ్లేది, ఇంటికి కాదు కదా. ఆమెకు ఒక్క ప్యాకెట్టే సరిపోతుంది కదా…’ అని హోటల్ యజమానికి అనుమానం వేసింది. ఆసక్తిగా ఆమెనే ఆ విషయం అడిగాడు. ఆమె నవ్వి ఊరుకుంది. ఒకరోజు ఆ వ్యాపారి, పనిమీద ఆ నర్సు పనిచేసే ఆసుపత్రికి వెళ్లాడు. అది మానసిక వికలాంగుల దవాఖాన. పని ముగించుకుని బయటికి వస్తూ ఉంటే బాదం చెట్టు కింద నర్సు కూర్చుని ఉంది.
ఆమె చుట్టూ నలుగురు ఉన్నారు. ఆమె భోజన పొట్లాలను విప్పి ఆ నలుగురికీ సరిసమానంగా పంచుతున్నది. అది చూసి హోటల్ యజమాని ఆశ్చర్యపోయాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్తో ‘మేడమ్ ఎందుకలా చేస్తున్నద’ని అడిగాడు. ‘ఈ ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు మాత్రమే ఇక్కడ భోజనం పెడతారు. వారిని చూడటానికి, వారిని తీసుకువచ్చిన వారికి పెట్టరు. ఆ రోగులతో వచ్చిన వారిలో చాలామంది పేదవారు.
అన్నం కొని తినేంత డబ్బులు వారి దగ్గర ఉండవు. అందుకని మేడమ్ రోజూ రెండు పొట్లాలు హోటల్లో కొని ఇలా పంచుతూ ఉంటుంది. ఆమె తను తినే ఆహారాన్ని ఇంటినుంచే తెచ్చుకుంటుంది’ అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడమంత పుణ్యం మరొకటి లేదని తెలుసుకున్నాడు హోటల్ యజమాని. మరుసటి రోజు నుంచి మరో పొట్లం ఆమెకు ఉచితంగా ఇచ్చి ఆసుపత్రి సందర్శకులకు పంచమన్నాడు. హోటల్లో మిగిలిన ఆహారాన్ని గుడుల ముందు ఉండే భిక్షగాళ్లకు పంచడం ప్రారంభించాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు 93936 62821