‘యేప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః
తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్
(భగవద్గీత 9-23)
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం. అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడు ఒక్కడే అయినా, దేశకాల పరిస్థితులు, నమ్మకాలు, వ్యక్తిగత ఇష్టాలను బట్టి వేర్వేరు రూపాలతో కొలుస్తుంటారు. సాధారణ మనుషుల రూపాలు, పేర్లతోపాటు వారి అభిరుచులు, అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. అలాగే దైవాన్ని వివిధ రూపాలుగా కొలిచి, వివిధ నామాలతో, రకరకాల పద్ధతులలో ఉపాసిస్తూ ఉంటారు.
కొందరు శక్తిగా భావిస్తారు. మరికొందరు రాముడిగా కీర్తిస్తారు. ఇంకొందరు శివుడిగా భావించి స్తుతిస్తారు. ఎవరు ఎలా ఆరాధించినా, ఏవిధంగా ఉపాసించినా దైవం కరుణిస్తాడు. భక్తుడు ఏ రూపంలో పూజిస్తే.. అదే రూపంలో అనుగ్రహిస్తాడు భగవానుడు. ఆ పేరుతోనే పలుకుతాడు దేవదేవుడు. ఏ దేవుడి కోసం చేసిన ఆరాధనలైనా అవన్నీ అనంతమైన పరమాత్ముడికే చెందుతాయని తెలుసుకోవాలి.
– శ్రీ