అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపి వాయస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శ్శుచిః నిత్యవిధుల్లో పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోక పఠనంతోనే ప్రారంభమవుతాయి. ఈ మంత్రం చదువుతూ శరీరంపై, పూజ ద్రవ్యాలపై నీళ్లు చల్లుతారు. భగవంతుడి అనుగ్రహం పొందాలంటే బాహ్య, అంతరంగ శౌచం (శుభ్రత) తప్పనిసరి. దైవనామాన్ని చదువుతూ అంతరంగాన్ని శుభ్రం చేసుకొని పూజ మొదలుపెట్టాలని చెబుతారు పెద్దలు.
మనసు పవిత్రంగా ఉండాలంటే ముందుగా శరీరం శుభ్రంగా ఉండాలి. తర్వాత అంతరంగం పరిశుభ్రంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తించే సనాతన ధర్మం శుభ్రతకు చాలా ప్రాధాన్యాన్నిచ్చింది. స్నానాది విధులు బాహ్య శౌచాన్ని కలిగిస్తాయి. భౌతికంగా శుభ్రంగా ఉన్నప్పుడే మానసిక ఉన్నతి సాధ్యమవుతుంది. పైకి చూడటానికి శుభ్రంగా కనిపించినా అంతరంగంలో మాత్రం ఎన్నో వాసనలు పేరుకుపోయి ఉంటాయి. అసూయ, ఆందోళన, ఈర్ష్య, ద్వేషం, కోపం ఇలా ఎన్నో అవగుణాలు మనసును ఆవహించి ఉంటాయి. వాటన్నిటినీ తొలగించుకోవడమే అంతర్ శుచి. మనసును స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచటమే మానసిక శౌచం. స్వచ్ఛమైన మనసుతో కాసేపు ధ్యానం చేసినా అనంతమైన ప్రభావం కలుగుతుంది. చిత్తం శుద్ధిగా ఉన్నప్పుడే మలినాలేవీ శరీరానికి అంటకుండా ఉంటాయి.
నలుగురిలో అందంగా కనిపించడానికి శుభ్రత పాటించాలి అనుకుంటాం. లౌకికంగా అది ఆచరించాల్సిన నియమం. అందంగా కనిపించడం కోసమే కాదు ఆత్మశుద్ధికీ శుచి అవసరం. శుభ్రత వల్ల బలం, ఆయుష్షు, ఆరోగ్యం లభిస్తాయని చెబుతున్నది శాస్త్రం. శుభ్రత లేని చోట పరమాత్మ ఉండడు. స్నానం చేసి, పరిశుభ్రమైన వస్ర్తాలు ధరించి ధ్యానం ప్రారంభించాలి. ఇది ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టు. శాస్త్ర గ్రంథాలు కూడా ‘శుచిత్వం మాతృరూపేణ’ అంటాయి. శుచిత్వం మనకు తల్లివంటిది. తల్లి ఏవిధంగా బిడ్డకు సదా రక్షగా ఉంటుందో, శౌచం కూడా మనల్ని అలాగే రక్షిస్తుందని భావం. వేదమంత్రాలు, ఉపనిషత్తులు సైతం శుచికి తగు ప్రాధాన్యం ఇచ్చాయి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటమే శుచిత్వం అంటుంది స్కాందోపనిషత్తు. ఇంద్రియాలపై పట్టు ఉన్నప్పుడు, మనసు పెడదారి పట్టే అవకాశం ఉండదు. అప్పుడు జీవనయానం ధర్మబద్ధంగా కొనసాగుతుంది. ధర్మమార్గంలో మనసు ప్రయాణించడమే ఆంతరంగిక శౌచం అంటుంది భగవద్గీత. ‘శుచిత్వమే జ్ఞానం’ అని ప్రకటించాడు కృష్ణ పరమాత్మ. శారీరక సౌఖ్యానికి, మానసిక ఉన్నతికి శుచిత్వాన్ని జీవనవిధానంగా మార్చుకోవాలి.
– విష్ణువర్ధన్