‘మిథ్యాజ్ఞానం’ బ్రహ్మజ్ఞానానికి ప్రతిబంధకం. ‘ఒకదాన్ని మరొక దానిగా, లేనిదానిని ఉన్నట్లు’గా నమ్మడమే ‘మిథ్యాజ్ఞానం’. సృష్టి స్థితి లయకారుడైన పరబ్రహ్మ తత్తాన్ని తెలుసుకోవడమే ‘బ్రహ్మజ్ఞానం’. బ్రహ్మం ఎల్లప్పుడూ వుంటాడు కనుక తాను ‘సత్యం’. అతను పుట్టుక లేనివాడు కనుక ‘అజుడు’. మరణం లేనివాడు కనుక ‘అమృతం’. ఈ ‘పరబ్రహ్మ సాక్షాత్కారం’ అంత సులభంగా కలిగేది కాదు. సాక్షాత్కారం చేసుకొనేవాడు ఆత్మజ్ఞాని కావలసి ఉంటుంది. ‘తానెవరో, తన స్వరూప స్వభావాలేమిటో, తాను ఎందుకు శరీరధారి అయ్యాడో, ప్రకృతిచేత ఎందుకు బంధితుడైనాడో తెలుసుకోవడమే’ ఆత్మజ్ఞానం. పరబ్రహ్మలాగా జీవునికికూడా ఉనికి ఉంది. ఆనందాన్ని ఇచ్చేవాడు పరబ్రహ్మ అయితే, ఆనందానికి అర్హత సంపాదించుకొనేవాడు జీవుడు. నిజానికి ‘జీవేశ్వరులిద్దరూ’ కలిసే ఉన్నారు. కాని, అజ్ఞానం (మోహం) వల్ల జీవుడు శరీరధారి అవుతూ పరబ్రహ్మను విస్మరిస్తున్నాడు. తిరిగి తానెవరో, ఎందుకీ ప్రపంచంలోకి వచ్చాడో తెలుసుకోగలిగితే బ్రహ్మజ్ఞానం పొందటానికి వీలవుతుంది.
జ్ఞానం ఎప్పటికీ చెడిపోయేది కాదు. అజ్ఞానంలో ఉన్నంత కాలం దుఃఖం తప్పదు. అజ్ఞానం నుంచి బయటపడితేనే మోక్షం. కనుక, మొదట మనం ఆత్మజ్ఞానాన్ని అలవర్చుకోవాలి. ఆత్మజ్ఞానం వల్ల మిథ్యాజ్ఞానం తొలగుతుంది. దీనికి ‘యోగాభ్యాసమే ముఖ్యసాధనమని’ అనుభవజ్ఞుల అభిప్రాయం. యోగం వల్ల మానవుడు క్రమంగా దుఃఖం నుంచి బయటపడతాడు. అప్పుడు దుఃఖకారకమైన ప్రపంచ తత్తాన్నీ తెలుసుకోగలుగుతాడు. ‘ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉండదని, దుఃఖమూ శాశ్వతం కాదని’ గ్రహించి, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంద్రియాలను, మనస్సును అదుపులో పెట్టుకొంటాడు. అన్ని ప్రాణుల్లో అంతరాత్మగా ఉన్న పరబ్రహ్మను తెలుసుకొంటాడు. ఒక విధంగా ‘యోగయుక్తుడు’ అవుతాడు. అలా, పాపాలనుంచి విముక్తుడవుతాడు. ఎప్పుడైతే పాపాలనుంచి బయటపడతాడో అప్పుడే ‘పరబ్రహ్మ సాక్షాత్కారం’ లభిస్తుంది.
పరబ్రహ్మను వేదం ‘శుద్ధం అపాప విద్ధం’ అని వర్ణిస్తున్నది. ‘శుద్ధుడు’ అంటే అవిద్య లేనివాడని, ‘అపాప విద్ధుడు’ అంటే పాపం అంటనివాడని అర్థం. అవిద్యనుండి మానవుడు వైదొలగినప్పుడే శుద్ధుడవుతాడు. అట్లే, కర్మ ఫలాపేక్ష లేకుండా కర్తవ్యకర్మలు చేసినప్పుడే అతడు పాపాలకు దూరంగా ఉండగలుగుతాడు. మానవుడు కర్మలు చేసినంత కాలం జన్మలెత్తుతూనే ఉంటాడు. జన్మలెత్తినంత కాలం సుఖమో, దుఃఖమో అనుభవిస్తూనే ఉంటాడు. ఒక విధంగా పుణ్యకర్మలు మానవజన్మ ఎత్తడానికి అవకాశం ఇస్తే, పాపకర్మలు పశుపక్ష్యాది, క్రిమికీటకాది జన్మలెత్తడానికి అవకాశమిస్తాయి. అయితే, ఆత్మజ్ఞానం కలిగినవాడు కర్తవ్యకర్మలు చేస్తూ, వాటి ఫలాలను విడిచి పెడతాడు. దీంతో పాపపుణ్యాలు రెండిటికీ దూరమవుతాడు. అప్పుడు మాత్రమే అతనికి పరబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుందని ‘ముండకోపనిషత్తు’ పేర్కొంది.
‘యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణం
కర్తార మీశం పురుషం బ్రహ్మ యోనిం
తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ
నిరంజనః పరమం సామ్య ముపైతి॥
–ముండకోపనిషత్తు (3.1.3)
‘తమ అజ్ఞానంతోనే మనుషులు దేవుడే అన్నీ మనచేత చేయిస్తాడని, అన్ని పనులకూ అతడే కారణమని’ భావిస్తారు. కానీ, పరమాత్మ మనకు ఏ పనినీ అంటగట్టడు. ‘ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలని, దానివల్ల ఇతరులకు మేలు జరగాలని మాత్రమే’ ఉపదేశిస్తాడు. అంతరాత్మ రూపంలో ఉండి మనల్ని మంచి పనులు చేయడానికి ప్రోత్సహించేవాడు పరమాత్మనే. అంతరాత్మ ఆదేశాన్ని పెడచెవిన పెట్టేవారినే యజుర్వేదం ‘ఆత్మ హననులు’ అంటున్నది.
‘నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః
–భగవద్గీత (5.15)
‘పరమాత్మ ఎవరి పాపాన్నిగాని, పుణ్యాన్నిగాని స్వీకరించడు. కేవలం మిథ్యాజ్ఞానం చేతనే మనుషులు మోహితులు అవుతున్నారు.’ ఇదీ మనందరం గ్రహించవలసిన అసలు విషయం.
–ఆచార్య మసన చెన్నప్ప
98856 54381