శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అభిషేకాలు, షోడషోపచార పూజాధి క్రతువులు నిర్వహించారు. సాయంత్రం భ్రమరాంబ అమ్మవారికి ప్రీతికరమైన గులాబీ, గన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్థనం, మల్లెలు, చామంతులతో అలకరించిన ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి సేవా మహా సంకల్పాన్ని పఠించారు. అనంతరం అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్రనామాలు, షోడశోపచార క్రతువులతో ఊయలసేవ, పల్లకీసేవలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు.
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అభివృద్ధి పనులకు దాతలు రూ.1.40లక్షల విలువగల ఎలక్ట్రికల్ పరికరాలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన కాకతీయ ఎనర్జీసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు పీఆర్ లక్ష్మణ్రావు ఆలయ ఎలక్ట్రికల్ డీఈ మల్లికార్జున ప్రసాద్కు అవుట్డోర్ లైటింగ్ ఆటోమేటిక్ స్విచ్లను అందించారు. దాతలకు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.