ఓ ముని ధ్యానం కోసం గంగానదికి బయల్దేరాడు. దారిలో ఒక ఊళ్లో హడావుడి కనిపించి ఆగాడు. అక్కడి మహిళలు గ్రామ దేవతలకు పొంగళ్లు పెడుతున్నారు. ‘ఆ గ్రామదేవత గొప్పది, ఈ దేవత గొప్పది’ అని వాదించుకోసాగారు. కొద్దిసేపటికి వాదనలు ముదిరి గొడవగా మారింది. అందరూ కలిసి మునిని ఆశ్రయించారు. ఏ గ్రామదేవత గొప్పదో చెప్పమన్నారు. ‘నాతోపాటు గంగానది వద్దకు వస్తే ఏ గ్రామదేవత గొప్పదో చెబుతాను’ అన్నాడు ముని. అందరూ ముని వెంట కదిలారు. గంగ దరికి చేరాక ముని అందరినీ ఒడ్డుపై కూర్చోబెట్టి నదిని చూడమన్నాడు. తర్వాత కొందరిని రెండో మెట్టు మీద నిలబడి స్నానం చేయమన్నాడు.
మరి కొందరిని మూడో మెట్టు మీద, ఇంకొందరిని నాలుగో మెట్టు మీద ఉండి స్నానం చేయమన్నాడు. అలా చేస్తే పుణ్యం లభిస్తుందని చెప్పాడు. దూరంగా ఉన్న గుడిని చూపిస్తూ ‘మీరందరూ స్నానాలు పూర్తి చేసుకుని అక్కడికి రండి’ అని బయల్దేరబోయాడు. అంతలో ఓ మహిళ ‘ఏ మెట్టు మీద స్నానం చేస్తే ఏమిటి? ప్రవహించేదంతా గంగానదే కదా!’ అని అడిగింది. ఆయన చిరునవ్వుతో ‘నేను చెప్పేది అదే! గంగానదిలో మునిగి స్నానం చేయడానికి చాలాచోట్ల మెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని మెట్లు మంచివి, మరికొన్ని చెడ్డవి అని చెప్పడానికి వీలు లేదు. ఏ మెట్ల మీదుగా వెళ్లినా నదిలో స్నానం చేయవచ్చు. పుణ్యం సంపాదించవచ్చు. అలాగే గ్రామ దేవతలు కూడా. నమ్మి ఎవరిని ప్రార్థించినా మంచిదే. మనకు మనమే ఆ దేవత గొప్ప, ఈ దేవత గొప్ప అంటుంటాం. ఎవరుగొప్ప అనే ఆలోచనే మంచిది కాదు’ అని వివరించాడు. దేవతలందరూ సమానమే అని తెలుసుకున్న గ్రామవాసులు తమ అజ్ఞానాన్ని కడిగేయమంటూ గంగానదిలో మరోసారి స్నానం చేశారు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821