శుద్ధలక్ష్మీః మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ
శ్రీర్లక్ష్మీః వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా
అంటూ లక్ష్మీదేవిని అనేక రూపాల్లో స్తుతిస్తుంటాం. ‘లక్ష్మలు’ అంటే ‘శుభ లక్షణాలు’. అన్ని రకాల శుభ లక్షణాలు కలిగిందే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ఎనిమిది రూపాల్లో స్తుతిస్తాం. లక్ష్మీదేవి కానిది ఏది? కనిపించే ధనం ధనలక్ష్మి అయినా, ఎన్నో కనిపించని రూపాలు లక్ష్మీదేవి రూపంలో మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి. కనిపించే సంపదలకన్నా కనిపించని సంపదలే బలమైనవి. ప్రస్తుత కాలంలో ఆరోగ్యమే సంపద. సంతృప్తి, ప్రశాంతత, ఆనందం, ధైర్యం, భావ వ్యక్తీకరణ, అందం, సౌఖ్యం, సంతోషం, సంతానం ఇవన్నీ లక్ష్మీరూపాలే. మనలోని శుభ లక్షణాలనుబట్టి ఆ లక్ష్మీదేవి మనకు ప్రాప్తిస్తుంది. విజయం, మోక్షం, జ్ఞానం, శ్రేష్ఠత్వం మొదలైనవికూడా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కలిగేవే. వీటికి కొలతలు ఉండవు. ఒక్క ధనలక్ష్మీదేవికి మాత్రమే లెక్కలకు అవకాశం ఉంటుంది. ఈ ప్రకృతిలోని అన్ని శుభ లక్షణాలకూ మనం లక్ష్మీదేవిని ప్రతీకగానే ఉపయోగిస్తున్నాం.
‘అక్షయ తృతీయ’ కూడా సంపదల నిర్వహణకు ఒక మంచిరోజు. ఆ రోజు మొదలుకొని మళ్ళీ ‘అక్షయ తృతీయ’ వరకు నియమబద్ధంగా చేసే జపం వల్ల మనకు ఆనందాదులన్నీ సిద్ధిస్తాయి. సంపదలన్నీ మనతో, మనలో ఉండి తీరుతాయి. పై శ్లోకం జపించినా, శ్రీసూక్తాన్ని 15 సార్లు ప్రతి రోజూ పఠిస్తున్నా, లక్ష్మీ అష్టోత్తరాన్ని ప్రతి రోజూ 11 సార్లు పారాయణం చేస్తున్నా మన శరీరంలో, మనస్సులో, గృహంలో సర్వసంపదలూ సిద్ధిస్తాయని శాస్ర్తాలు చెబుతున్నాయి. ధనలక్ష్మీ అనుగ్రహం కోసం ధనదానాదులు బాగా చేయాల్సిన రోజుకూడా ‘అక్షయ తృతీయ’. ఈ రోజున లక్ష్మీ ఆరాధన చేసి ‘ఓం శ్రీం లక్ష్మీం సర్వసిద్ధి ప్రదాయై నమః’ అనే జపాన్ని వెయ్యిసార్లు జపిస్తుంటే అతి త్వరలో కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయనడంలో సందేహం లేదు.