హైందవ ధర్మంలో ప్రతి పర్వానికీ ఓ ప్రత్యేకత ఉంది. కాలక్రమంలో కొన్ని పండుగల అంతరార్థం మారిపోయింది. అసలు కారణం మరుగునపడి.. కొసరు కారణం పైచేయి సాధిస్తున్నది. ‘అక్షయ తృతీయ’ విషయంలోనూ ఇదే కనిపిస్తుంది. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. ఈ పండుగ స్థిరపడటం వెనుక పౌరాణిక, చారిత్రక కథనాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు చేసే దానధర్మాలు, జపతపాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయని, దైవానుగ్రహం అక్షయంగా పొందే విశేషమైన పర్వమని పరమేశ్వరుడు.. పార్వతికి ఉపదేశించాడట.
సుర గంగ అవనిపై అవతరించిన రోజు ఇదేనని చెబుతారు పెద్దలు. అక్షయ తృతీయకు సంబంధించిన పలు ఆసక్తికర కథనాలు ద్వాపరయుగంలో కనిపిస్తాయి. కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుడిని కలుసుకొని, మూడు పిడికిళ్ల అటుకులు నివేదనగా సమర్పించి.. అంతులేని సంపదలు పొందిన తిథి ఇదేనని తెలుస్తున్నది. వనవాస సమయంలో ధర్మరాజుకు సూర్యభగవానుడు అక్షయ పాత్ర అనుగ్రహించింది కూడా ఇదే రోజని అందుకే దీనిని అక్షయ తృతీయ అంటారని కొందరి విశ్వాసం.
ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరి కాయను స్వీకరించి, ఆమె స్థితిగతులనూ, ఇచ్చే గుణాన్ని గుర్తించి ఆదిశంకరులు అమ్మవారిని ప్రార్థించి ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా ఈ వైశాఖ శుద్ధ తదియనాడే అని చెబుతారు. ఆత్మానుసంధానంతో ఐశ్వర్యలక్ష్మిని ఆవాహనం చేసి ఆదిశంకరులు ‘కనకధారా స్తోత్రా’న్ని జాతికి అనుగ్రహించిన ఈ పర్వదినం ఎంతో విశిష్టమైనది. ఈనాడు చేసే ఏ చిన్న సత్కార్యమైనా అనంత ఫలాన్నిస్తుందని పెద్దల మాట.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనీ, అలా కొనుగోలు చేస్తే బంగారం అక్షయం అవుతుందనీ ప్రస్తుతం లోకంలో ప్రచారంలో ఉన్న విశ్వాసానికి ప్రమాణం కనిపించదు. ఈ పండుగ పూట పుణ్యకార్యాలు ఆచరించాలనీ, శక్తిమేరకు దానధర్మాలు చేయాలని మాత్రమే శాస్త్రం నిర్దేశించింది. అయితే దానాలలో సువర్ణ దానం ప్రత్యేకమైనది. అందుకోసం బంగారం దానం చేయాలని సూచించారు. అంతేకానీ, కొనుగోలు చేసి బోషాణంలో దాచుకోవాలని కాదు! చివరిగా, అక్షయ తృతీయ రోజు చేసే సత్కార్యం ఎంతటి విశేష శుభ ఫలితాన్ని ఇస్తుందో.. చెడు కార్యం తలపెడితే అంతటి అశుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి.. ఈ పర్వదినం సందర్భంగా జపం, దానం చేసి ధన్యత పొందుదాం.
…? శ్రీ