ఒక యువకుడికి జీవిత పరమార్థం తెలుసుకోవాలని అనిపించింది. అందుకోసం పుస్తకాలు చదవాలనుకున్నాడు. అయితే, ‘ఏ భాష నేర్చుకుంటే ఎక్కువ విషయాలు తెలుసుకోగలం’ అనే ఆలోచనలో పడ్డాడు. దగ్గర్లోని ఆశ్రమానికి వెళ్లి సందేహనివృత్తి చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఆశ్రమంలో ఓ సత్సంగం జరగనుంది. అక్కడికి దేశవిదేశీయులు, పండితపామరులు వచ్చారు. దానికి హాజరైన ఒక పండితుడిని ఆ యువకుడు ‘ఏది గొప్పభాష, ఏ భాషను నేర్చుకోమంటారు?’ అని అడిగాడు. అనేక భాషలకు సంస్కృతం మూలం. పరమేశ్వరుని డమరుక నాదం నుంచి ఆ భాష వెలువడిన శుద్ధ బ్రహ్మమే సంస్కృత భాష అంటారు. ఆ భాష నేర్చుకుంటే శ్రేష్ఠమని ఆ పండితుడు సలహా ఇచ్చాడు. అక్కడే ఉన్న ఉత్తర భారతీయుడు హిందీ నేర్చుకోమని సూచించాడు.
విదేశీయుడు ఆంగ్లం నేర్చుకోమన్నాడు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో భాష నేర్చుకోమని చెప్పుకొచ్చారు. ఆశ్రమంలోని గురువు ఇదంతా గమనించి యువకుడిని దగ్గరికి రమ్మన్నాడు. జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే నువ్వు మౌనభాష నేర్చుకోవాలని చెప్పాడు. మనలోకి మనం ప్రయాణించే అవకాశం మౌనంలో మాత్రమే దొరుకుతుంది. అది ఖర్చుతో కూడిన వ్యవహారం కాదు. దానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా అవసరం లేదు. ఎవరి సాయమూ తీసుకోవాల్సిన పని లేదు. మనకు మనమే చేయగలిగినది. మౌనం వహించి మనల్ని మనం గమనిస్తే చాలు. ఆ మౌనం మనకెంతో నేర్పగలదు. ఈ ప్రకృతితో అనుసంధానం చేయగలదు. మౌనంలో ఉండి మనలోకి మనం తొంగి చూడాలి. అప్పుడు మనకు జీవితంపట్ల అవగాహన కలుగుతుంది. మనమే ప్రపంచం, మనలోనే ప్రపంచం ఉందని అర్థమవుతుందని వివరించాడు. మౌనాన్ని మించిన గొప్ప భాష లేదని తెలుసుకొని అక్కడినుంచి కదిలాడు యువకుడు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821