ఓ ఊళ్లోని రామాలయం దగ్గర ఒక గురువు ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం మధ్యలో ఉండగా అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. అతని చేతి అన్ని వేళ్లకూ బంగారు ఉంగరాలు, మెడనిండా గొలుసులు ఉన్నాయి. ప్రసంగం పూర్తయ్యాక కార్యక్రమ నిర్వాహకులు బెల్లం పొంగలి ప్రసాదం బాదం ఆకుల్లో పెట్టి పంచసాగారు. అందరితోపాటు ఆ వ్యక్తి కూడా ప్రసాదం తీసుకున్నాడు. ప్రసాదం పట్టుకొని.. గురువు దగ్గరికి వెళ్లి ‘జీవితం ఆనందమయం కావాలంటే ఏం చేయాలి?’ అని ప్రశ్నించాడు. ‘ముందు ప్రసాదం తినిరా. నిదానంగా మాట్లాడుకుందాం’ అని చెప్పాడు గురువు. ఆ వ్యక్తి చెట్టు చాటుకు వెళ్లి ప్రసాదం తిన్నాడు. అతను చేతులు కడుక్కోవడం గురువు గమనించాడు. తనను దగ్గరికి పిలిచి పెద్ద బాదం ఆకులో ప్రసాదం పెట్టించి ఇచ్చాడు.
మందహాసం చేస్తూ ‘ఈ ప్రసాదం ఇక్కడున్న వారందరికీ పంచి పెట్టి, మిగిలింది తిను’ అన్నాడు. అతను గురువు చెప్పినట్లే చేశాడు. వెళ్తూ వెళ్తూ చివరిగా తన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందామని మళ్లీ గురువు దగ్గరికి వచ్చాడు. అప్పుడు గురువు ‘మొదటిసారి ప్రసాదం తిన్నప్పుడు నీకు ఆనందంగా ఉందా? రెండోసారి తిన్నప్పుడు ఆనందంగా ఉందా?’ అని ప్రశ్నించాడు. ‘మొదటిసారికన్నా రెండోసారి తిన్నప్పుడే చాలా ఆనందంగా అనిపించింది’ అని బదులిచ్చాడా వ్యక్తి. ‘మనం ఏదైనా ఒకరికి ఇస్తున్నామంటే మన శక్తి రెండింతలు పెరుగుతుంది. ఇవ్వడంలో ఉన్న తృప్తి, ఆనందం మరెందులోనూ రాదు’ అని బోధించాడు. ఆనంద రహస్యం తెలుసుకున్న ఆ వ్యక్తి సంతోషంగా అక్కడినుంచి కదిలాడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821