‘పెండ్లయిన జంట (ఇద్దరూ) ఒకే ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం తప్పనిసరా?’ ఇది సర్వసాధారణ సందేహం. ‘ఆధ్యాత్మిక మార్గం’ అనేది ఒక అనుసరణ, నమ్మక వ్యవస్థ కాదు. అందులో మీరొక అన్వేషి అంతే. భర్త, భార్య లేదా ఇంకెవరైనా సరే ‘సత్యాన్వేషి’ కాకపోతే సహజంగానే వారు ప్రశ్నించేవారు అయ్యుంటారు. ఈ ప్రపంచమంతా అంతే. ఎప్పుడూ ఏదో కావాలనే ఉంటుంది. జిజ్ఞాసులైతే కోరుకొనే లక్షణమూ తగ్గిపోతుంది. ఇద్దరూ కోరుకొనేది తృప్తే కదా. జిజ్ఞాసిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సంపూర్ణమైన తృప్తి గలవారిగా చేసుకోవాలో మీకు అర్థం కాదు. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేనికైనా సమర్పించుకోకపోతే అత్యద్భుత విషయాలుకూడా పనిచెయ్యవు. అవసరమైనంత మేరకు ‘సంలీనం’ కాకపోతే అన్నీ అందని ద్రాక్షలే అవుతాయి. మీరు దైవత్వంతో పూర్తిగా లీనం కాకపోతే ఆ తత్త్వం మీ పక్కనే ఉన్నా చూడలేరు. పీల్చే గాలి దేవుడు కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రెండు నిమిషాలపాటు ముక్కు మూసుకుని కూర్చోండి. కొంత సేపయ్యాక మీకు, ‘దేవుడు కావాలా? గాలి కావాలా?’ అంటే, గాలియే కావాలంటారు. సంపూర్ణంగా మమేకం అవ్వక పోవడం వల్లే భగవంతుడు కనిపించట్లేదు, అంతే.
‘తాదాత్మ్యత’ అన్నది ఉండాలి. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియంతా ఏమిటంటే, ఒక తీవ్రమైన తాదాత్మ్య భావనను పెంపొందించుకోవడం. ‘మీరు-నేను’ అనే హద్దులను దాటి అందులో లీనమవటమే. అది ఏ స్థాయి అంటే, ‘తీసుకునే శ్వాస, తినే ఆహారం అన్నీ ఒక విస్ఫోటనంలా మిమ్మల్ని ముంచెత్తాలి. తినేది ఆహారంలా కాకుండా కొన్ని మూలకణాలవలె కనిపించి, వాటిని తిన్నాక జరిగేదేమిటో తెలిస్తే ఒక అద్భుతం సాక్షాత్కారమవుతుంది’. ఇది నా అనుభవంలోకి వచ్చినప్పుడు నాలో ఒక విస్ఫోటనం జరిగి, అది నన్ను మహాద్భుతానికి లోను చేసింది. అవసరమైనంత లీనం కాలేకపోవటం వల్ల ఏదీ మీ దరిచేరదు. మీరు ఎన్నిసార్లిలా స్వర్గాన్ని తప్పించుకున్నారో చెప్పలేను. మీరు ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉండి, మీ జీవిత భాగస్వామి ఇంకొక ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే, దాని అర్థం ‘ఇద్దరూ పోట్లాడుకొమ్మని’ కాదు. ఆధ్యాత్మిక మార్గమనేది ఒక అనుభవ పూర్వకమైన ప్రక్రియ. బలవంతం మీద కాదు, ఎరుకతో సాధించాలి.
ఒక నిర్భంధస్థితిలో ఉంటారు కాబట్టే, కొన్ని స్పర్ధలు వస్తాయి. నిర్భంధస్థితిని దాటుకొని చైతన్యాని (ఎరుక)కి చేరువకండి. అప్పుడు సమస్థితికి వస్తారు. భారతదేశంలో అన్నిటికంటే అందమైన విషయం ఏమిటంటే, ఒకే ఇంట్లో ఉన్న అయిదుగురు, తమ అయిదుగురు దేవుళ్ళను పూజిస్తూనే హాయిగా గొడవ లేకుండా ఉండగలరు. ఈరోజుకీ ఒక ఇంట్లోని పూజగదిలో దాదాపుగా కనీసం పాతికవరకు దేవుళ్ళుంటారు. మగవారు ఒక దేవుణ్ణి పూజిస్తే, ఆడవారు ఒక అరడజను దేవతలను కొలుస్తారు. పిల్లలు వారికి నచ్చిన దేవుళ్ళని ఆరాధిస్తారు.
ఇదే కాకుండా, ఎవ్వరూ పెద్దగా పూజించని దేవుళ్ళుకూడా ఉంటారు మందిరంలో! ఎందుకంటే, ఆ ప్రతిమలు వాళ్లకి పక్కింటినించి వచ్చుంటాయి. ఇదంతా ఇక్కడ తప్ప ప్రపంచంలో వేరేచోట్ల దాదాపు అసాధ్యం. జీవిత భాగస్వాములు ఇద్దరూ వేర్వేరు ఆధ్యాత్మిక మార్గాల్లో ఉండటమన్నది అసలు సమస్యే కాదు. కానీ, ఒకరు ప్రశ్నించే వ్యక్తి, మరొకరికి అన్వేషి అయితేనే సమస్య ఏర్పడుతుంది. ఇద్దరూ అన్వేషులైతే సమస్య ఏముంది? తెలియనితనం వల్లే ఈ అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ‘ఎవరు గొప్ప’ అనే దృష్టితోనూ చూడకండి. అది చాలా పెద్ద సమస్యవుతుంది. ఎదుటివారు మీకంటే మెరుగు అనుకుంటే చాలా మంచిది. ఇద్దరూ అలాగే అనుకోవడం మరీ మంచిది.
–సద్గురు జగ్గీ వాసుదేవ్