తిరుమల : ఆపదమొక్కులవాడు శ్రీ వేంకటేశ్వర కొలువు దీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు ( Compartments) నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. గురువారం స్వామివారిని 57,272 మంది భక్తులు దర్శించుకోగా 23,842 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.37 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
టీటీడీకి 10 లక్షలు విరాళం
తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కుమారుడు అరణి మదన్ మోహన్ జేఎంసీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున టీటీడీ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీని అందజేశారు.