పరమాత్మ ఆదిమధ్యాంత రహితుడు. కాలం అనంతం. అనాది మాత్రమే అంతం కాగలుగుతుంది. కాబట్టి ఆదిమధ్యాంత రహితమైన కాలానికి, పరమాత్మకు అభేదం. పరమాత్మ సర్వవ్యాపి. సర్వత్రా వ్యాపించి ఉన్నదానికి పయనం అవసరం లేదు. కాబట్టి నిశ్చలుడు. నిర్గుణుడైన పరమాత్మ ప్రకృతి మాధ్యమంగా సగుణుడయ్యాడు. సగుణ రూప పరమాత్మ చలనశీలుడు.
భువనభాండాలు ఉన్న విశ్వం నిశ్చలం. నడవలేని బ్రహ్మాండంలో కాలం సైతం నిశ్చలం. పద్నాలుగు భువనాల్లో ఒకటైన భూమిపైన జీవిస్తున్న మనకు సూర్యోదయం, సూర్యాస్తమయం వల్ల రోజులు ఏర్పడుతున్నాయి. చంద్రకళల వల్ల నెలలు తెలుస్తున్నాయి. నెలలు, రుతువుల వల్ల సంవత్సరాలు అవగతం అవుతున్నాయి. ఖగోళాల మాధ్యమంగా చలనశీల కాలగణనం చేయడమే జ్యోతిశ్శాస్త్రం పని. వేదానికి దృష్టిని ప్రసాదించే కన్నుగా జ్యోతిశ్శాస్ర్తాన్ని అభివర్ణించారు మన రుషులు.
అహోరాత్రం అంటే పగలు, రాత్రి కలిసిన దినం. ఇందులో ‘హోరా’ అనే రెండు అక్షరాలను తీసుకొని రుషులు కాల ప్రమాణాన్ని ఏర్పరిచారు. ఒక రోజులో 24 హోరలు. సంస్కృత భాషలో హోరా శబ్దమే ఆంగ్లంలో ‘అవర్’ (hour) అయింది. పాశ్చాత్య విజ్ఞానాన్ని ఆధారం చేసుకున్న గడియారం ప్రకారం రోజుకు 24 గంటలు, గంటకు అరవై నిమిషాలు, నిమిషానికి అరవై సెకన్లు. ఇవి స్థిరం. భారతీయులకు అలా కాదు, మన కాలగణనంలో సూర్యోదయం నుంచి సూర్యోదయానికి ఒక దినం. సూర్యోదయ సమయం రోజుకో రీతిగా ఉంటుంది. సమయ కొలమానాన్ని గతిశీలకంగా నిర్దేశించడమే భారతీయ జ్యోతిశ్శాస్త్ర లక్షణం. రోజుకు 30 ముహూర్తాలు.
అరవై ఘడియలు. ఘడియకు అరవై విఘడియలు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న కాలం ముప్పయ్ ఘడియలు లేదా పదిహేను ముహూర్తాలుగా విభజించారు. అలాగే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకున్న కాలాన్ని కూడా స్పష్టంగా నిర్దేశించారు. ఘడియ అంటే 24 నిమిషాలు. విఘడియకు 24 సెకన్లు. ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఇది స్థిరం కాదు. ఏ పగటికి ఆ పగలు, ఏ రాత్రికారాత్రి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకున్న సమయాన్ని 30 భాగాలు చేసుకొని ఘడియను నిర్థారించుకోవాలి.ప్రతి మూడు గంటలకు ఒక జాము. రోజులో ఎనిమిది జాములు. వీటికి ఎనిమిది పేర్లున్నాయి.
కాలాన్ని పరమాత్మ స్వరూపంగా భావించిన భారతీయులు! కాలాన్ని శాసించే మార్గాన్ని కూడా నిర్దేశించారు. సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయం అనే మూడు కాలాలలో గాయత్రీ మంత్ర మాధ్యమంగా సంధ్యావందనం ఆచరించడం అన్నది నిర్గుణోపాసనం. గాయత్రి మంత్రంలోని మూడు పాదాలు మూడు సంధ్యలకు, 24 అక్షరాలు 24 హోరలకు సంకేతాలు. 24 పూర్వముద్రలు గగన వీధిలో 24 హోరలలో సూర్యుడు ఉండే నిర్దుష్ట స్థానాలకు సంకేతాలు. అష్టకాలలలో (ఎనిమిది జాముల్లో) సూర్యుడి నుంచి భూమి పొందుతున్న లాభాల వివరణే ఉత్తర ముద్రలు ఎనిమిదింటికీ ఉన్న అంతరార్థం.
జరుగుతున్న మార్పుల రీత్యా కాలాన్ని సృష్టి, స్థితి, లయలుగా చెప్పుకొంటున్నా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా వరుసగా సృష్టి, స్థితి, లయకు అధిపతులు. కాల స్వరూపాన్ని సగుణ మార్గంలో అర్చించడమే త్రిమూర్తి పూజనం. సృష్టి, స్థితి, లయలను భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలుగా చెప్పుకొన్నప్పుడు ఈ పూజా విధానంలోని అంతరార్థం బోధపడుతుంది. మనం జన్మించిన మరుక్షణమే సృష్టి గతమైపోతుంది. గతానికి వర్తమానం లేదు. కాబట్టి సృష్టి కర్త అయిన బ్రహ్మదేవుడికి దేశమంతటికీ కలిపి ‘పుష్కర్’లో మాత్రమే గుడి ఉన్నది. ప్రతిజీవికీ భవిష్యత్తు ఉన్నది. కానీ, అది ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. భవిష్యత్తుకు రూపం లేదు. ఈ కారణంగా భవిష్యత్తుకు అధిపతి అయిన శివుడిని లింగాకారంలో అర్చిస్తున్నాం. వర్తమానమే జీవితం. వర్తమానం ఆహ్లాదకరంగా, వివరణాత్మకంగా ఉండాలి. అందుకే, విష్ణుమూర్తి అనేక అవతారాలలో అలంకార ప్రియుడయ్యాడు. కాలాన్ని నియంత్రించే పరమశివుడు మహాకాలుడు అయ్యాడు. ముగ్గురమ్మల మూలపుటమ్మ మహాకాళి అయింది. ఇదీ భారతీయులు కాలాన్ని అర్చించే విధానం.
మిక్కిలి వాడి మొనగలిగిన సూదితో లేత తామరాకును పొడిస్తే రంధ్రం కావడానికి పట్టే సమయాన్ని ‘త్రుటి’ అన్నారు. 43,20,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని ‘మహాయుగం’ అని పేర్కొన్నారు రుషులు. వెయ్యి మహాయుగాలకు ఒక కల్పం. త్రుటి నుంచి కల్పం వరకు ఉన్న కాలాన్ని విభజించి వాటికి పేర్లు పెట్టడం భారతీయులకే సొంతమైన విజ్ఞానం.
– వరిగొండ కాంతారావు 94418 86824