చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మొబైల్స్ వంటి సున్నితమైన వస్తువులు పగిలిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. దానికి కారణమైన వ్యక్తిని ఆ తర్వాత నెమ్మదిగా అడిగితే వాటి ఖరీదు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ కొందరు ఆమాత్రం ఆలోచన కూడా చెయ్యకుండా మరింత పెద్ద గొడవ చేస్తారు.
అలాగే చేసి చివరకు తన మొబైల్ పగలగొట్టిన ఫ్రెండ్ను పొడిచి చంపేశాడో యువకుడు. ఈ ఘటన భారత రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇందర్పురి ప్రాంతానికి చెందిన అర్జున్ (22) అనే యువకుడికి నితీష్ (22)తో గొడవైంది. తన మొబైల్ పగలగొట్టి, దానికి డబ్బు చెల్లించడానికి నిరాకరించాడనే కారణంతో నితీష్ను అర్జున్ పొడిచేశాడు.
రక్తపు మడుగులో ఉన్న నితీష్ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి అతను మరణించాడు. సాక్షుల కథనం, సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అర్జున్ను ట్రేస్ చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి రక్తంతో తడిసిన దుస్తులు, హత్యకు ఉపయోగించిన కత్తి, పగిలిన మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.