వర్గల్/సిద్దిపేట : ఒక్కగానొక్క కొడుకు ట్రాక్టర్ కిందపడి అకాలమృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. అప్పటిదాకా ఇంటివద్దే ఉండి. సొంత పొలంలో ట్రాక్టర్తో సాళ్లుకొడుదామని వెళ్లి కానరానిలోకాలకు వెళ్లి కన్నవారి కడుపుకోతకు కారణమయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే..వర్గల్ మండలం అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన కాయిత రాములుకు ముగ్గురు కూతళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. కొడుకు గణేశ్(21) ఇంటర్ పూర్తి చేసి వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు చేదోడు,వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం గ్రామశివారులోని తమ సొంత వ్యవసాయ పొలంలో ట్రాక్టర్కు రొటవేటర్ను బిగంచుకొని దున్నుతుండగా.. పరపాటున గిరికిల్లో పడటంతో తల, కుడిచేయి, చాతిభాగం నుజ్జునుజ్జు అయ్యాయి.
రన్నింగ్లో ఉన్న ట్రాక్టర్ కొంతదూరంలో రాతికడీలను ఢీకొట్టి ఆగిపోవడం చూసిన గ్రామానికి చెందినవారు వెంటనే రాములు కుటుబానికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న కుటుంబీకులు గణేశ్ దుర్మరణాన్ని చూసి హతాశులయ్యారు.
ఎదిగి వచ్చిన కొడుకు అకాలంగా మృత్యు వాతపడటంతో తల్లి దండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడు గణేశ్ తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గౌరారం ఎస్సై సంపత్కుమార్ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.