ఖమ్మం : నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ పి.సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం చింతకానిమండలానికి చెందిన అమర్లపూడి ప్రవీణ్కుమార్ అనే యువకుడు నగరంలోని ఎఫ్సీఐ గోడౌన్స్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో నిందితుణ్ణి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అరెస్టు చేసిన యువకుడు ఓ ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువున్న రోజుల్లోనే గంజాయికి అలవాటు పడటంతో పాటు విక్రయాలు జరుపుతుండేవాడని, గతంలోను విద్యాసంస్థలే లక్ష్యంగా గంజాయి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఓ డెలివరి సంస్థలో డెలివరీ బాయ్ గా పని చేస్తూనే గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడని విచారణలో వెల్లడైనట్లు వివరించారు. నిందితుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.