కుత్బుల్లాపూర్ : ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఆంధ్రప్రదేశ్ ఈస్ట్గోదావరి జిల్లా పోరుకొండ గ్రామానికి చెందిన చింతపల్లి శారద(25) నగరంలోని కొంపల్లి జయభేరి పార్కు శ్రీనివాస్నగర్లో నివాసంఉంటున్న తన చిన్నమ్మ చెంద్రమ్మ ఇంటికి జూలై 10న వచ్చింది. అప్పటి నుంచి పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలో ఈ నెల 4న ఇంట్లో ఎవరు లేని సమయంలో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో చిన్నమ్మతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతంతో పాటు బంధువులు, తెలిసిన వారికి ఫోన్ద్వారా వాకబు చేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలు తండ్రి శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.