ముంబై : వృద్ధ మహిళను రూ 3.98 కోట్లకు మోసగించిన ముగ్గురు నైజీరియన్ కేటుగాళ్లను ఢిల్లీలో పూణే పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితులను జంగో నికోలస్ (29) మండే ఒకెకె (26), పౌలినస్ బంగో (29)లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బాధిత మహిళ (60)కు గత ఏడాది ఫేస్బుక్ వేదికగా పరిచయమైన నిందితుడు తాను విదేశీయుడినని కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నానని నమ్మబలికాడు.
ఆపై వారు ఫోన్ నెంబర్లు మార్చుకుని వాట్సాప్లో చాట్ చేశారు. కొద్దినెలల తర్వాత మహిళ తన బర్త్డే వేడుకలు జరుపుకుంటుండగా నిందితుడు తాను ఆమెకు బహుమతిగా హైఎండ్ ఐఫోన్ను పంపానని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఇతర చార్జీల కోసం డబ్బులు పంపాలని కోరాడు. ఆ తర్వాత తాను భారత్కు రాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తనను అరెస్ట్ చేశారని తన విడుదల కోసం పెద్దమొత్తంలో డబ్బులు అవసరమని డిమాండ్ చేశాడు.
ఇక ఆపై ఐఫోన్, జ్యూవెలరీ, విదేశీ కరెన్సీ పంపానని వాటికోసం కస్టమ్స్ క్లియరెన్స్ అంటూ లేనిపోని కారణాలు చూపి బాధిత మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజాడు. ఆమె ఇచ్చిన డబ్బులు పూర్తిగా తిరిగి ఇస్తానంటూ టోకరా వేశాడు. ఈ బహుమతుల కోసం బాధితురాలు రూ కోటి వరకూ డబ్బును నిందితుల ఖాతాకు తరలించింది. ఇక ఈ బహుమతులను అక్రమంగా తాము పంపడంతో ప్రభుత్వ సంస్ధలు చర్యలు చేపడతాయని వృద్ధ మహిళను బెదిరిస్తూ మరికొంత మొత్తం ఆమె నుంచి రాబట్టారు. నిందితుల ఆగడాలతో విసిగిపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నైజీరియన్ల బాగోతం బట్టబయలైంది.