న్యూఢిల్లీ : ఆన్లైన్ వేదికగా మోసాలు (Cyber Fraud) రోజురోజుకూ పెరుగుతున్నాయి. పోలీసులు, ప్రభుత్వం ప్రజల్ని ఎంతగా అప్రమత్తం చేస్తున్నా స్కామర్లు రోజుకో తరహాలో సైబర్ నేరాలతో చెలరేగుతున్నారు. ఇక తాజాగా అహ్మదాబాద్లో కొరియర్ డెలివరీ స్కామ్లో మోసపోయి ఓ మహిళ రూ. 1.38 లక్షలు పోగొట్టుకున్నారు. ఫ్యాషన్ డిజైనర్ మితిక్షా సేథ్ (25) తన పార్సిల్ రిసీవ్ చేసుకునేందుకు పంపిన లింక్ను క్లిక్ చేయడంతో భారీ మొత్తం కోల్పోయింది. పల్దిలోని ఓ టైలర్కు ఇచ్చిన క్లాత్ పీసులను కుట్టిన తర్వాత వచ్చే పార్సిల్ కోసం బాధితురాలు వేచిచూస్తోంది.
డ్రెస్ల స్టిచ్చింగ్ పూర్తయిన వెంటనే ఆర్డర్ను డెలివరీ నిమిత్తం పంపామని ఆమెకు టైలర్ సమాచారం అందించాడు. రెండు మూడు రోజుల తర్వాత కూడా పార్సిల్ రాకపోవడంతో టైలర్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఆమె పార్సిల్ను గూగుల్లో ట్రాక్ చేశారు. వెబ్సైట్లో పార్సిల్ ఆర్డర్ను ట్రాక్ చేసిన కొద్ది నిమిషాలకు ఆమెకు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. తాను కొరియర్ కంపెనీ ఉద్యోగినని అతడు పరిచయం చేసుకున్నాడు. డెలివరీ ఫీజు చెల్లించగానే పార్సిల్ డెలివరీ అవుతుందని ఆ వ్యక్తి సేథ్ను నమ్మబలికాడు.
పార్సిల్ను స్వీకరించేందుకు రూ. 5 చెల్లించాలని బాధితురాలిని కోరాడు. ఆపై పేమెంట్ చేసేందుకు కాలర్ ఆమెకు ఓ లింక్ పంపాడు. ఆ లింక్ ద్వారా బాధితురాలు రూ. 5 చెల్లించింది. పేమెంట్ పూర్తి అయిన తర్వాత అదనపు ఫీజు అంటూ మరో రూ. 5 పంపాలని కోరాడు. రెండవ లావాదేవీ తర్వాత ఇది ఆన్లైన్ ఫ్రాడ్ అని గుర్తించిన మహిళ తన బ్యాంక్ ఖాతాను డీయాక్టివేట్ చేసింది. మరికొద్ది రోజులు ట్రిప్లో ఉన్నందున మొబైల్ ఫోన్ను వాడలేదు. ఆపై కొద్దిరోజులకే తన బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ తగ్గినట్టు బాధితురాలు గుర్తించింది. బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించగా ఫ్రాడ్ జరిగిన తేదీల్లో ఆమె ఖాతా నుంచి నాలుగు లావాదేవీల ద్వారా మొత్తం రూ. 1.38 లక్షలు డెబిట్ అయినట్టు స్టేట్మెంట్లో గుర్తించింది. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read More :