ముంబై : దుబాయ్ నుంచి రూ 26 లక్షల విలువైన 500 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పుణే ఎయిర్పోర్టులో మహిళ(34) పట్టుబడింది. మహిళ అధికారుల కండ్లుకప్పి బంగారాన్ని తరలిస్తోందనే సమాచారంతో కస్టమ్స్ అధికారులు ఆమెను ప్రశ్నించారు. సోదాలు జరిపిన మీదట మహిళా ప్రయాణీకురాలి నుంచి 500 గ్రాముల బరువైన 24 క్యారెట్ల బంగారంతో కూడిన గాజులు, చైన్లను స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ రూ 26.45 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి మే 5న ఆమె స్పైస్జెట్ విమానంలో పుణే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. కస్టమ్స్ చట్ట నిబంధనల కింద ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు.
ఎయిర్పోర్ట్లో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన మరో మహిళను కూడా ప్రాధమిక దర్యాప్తు అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.