బెంగళూర్ : ఫేస్బుక్ ద్వారా పరిచయమైన 17 ఏండ్ల బాలుడిని బెంగళూర్కు చెందిన యువతి (20) పెండ్లి చేసుకోవడం కలకలం రేపింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో యువతిపై బాల్య వివాహ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్ అయిన యువతికి చిక్మగుళూర్ జిల్లాకు చెందిన 17 ఏండ్ల బాలుడితో ఫేస్బుక్ వేదికగా పరిచయం ఏర్పడింది.
కుటుంబ సభ్యులు అడ్డుచెప్పినా జూన్ 16న ఓ దేవాలయంలో బాలుడిని వివాహం చేసుకుంది. బాలుడు సైతం తనకు 21 ఏండ్లు అని చెబుతూ యువతి మెడలో తాళి కట్టాడు. టీనేజ్ బాలుడి బంధువుల సమక్షంలో పెండ్లి తంతు జరగ్గా స్థానికుడు ఒకరు చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం అందించాడు. దీంతో బాలుడి గ్రామానికి చేరుకున్న మహిళా శిశు సంక్షేమ అధికారులు విచారణ చేపట్టారు. ఆపై యువతితో పాటు పెండ్లికి హాజరైన బాలుడి బంధువులపై కేసు నమోదు చేశారు. బాల్య వివాహ నిషేధ చట్టం కింద యువతితో పాటు బాలుడి బంధువులపై కేసు నమోదు చేశామని చిక్మగుళూర్ ఎస్పీ అక్షయ్ మచ్చీంద్ర వెల్లడించారు.