ఆన్లైన్లో రమ్మీ ఆటకు బానిసగా మారిన మహిళ.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా రూ.10 లక్షలు పోగొట్టుకుంది. దీంతో తట్టుకోలేకపోయిన ఆమె స్నానానికి వెళ్తున్నానని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతసేపటికీ ఆమె బయటకు రాలేదు. తీరా చూస్తూ ఫ్యానుకు ఉరేసుకొని కనిపించింది. ఈ ఘటన తమిళనాడులోని మనాలీ న్యూ టౌన్లో వెలుగు చూసింది.
భవానీ అనే మహిళకు ఆరేళ్ల క్రితం భక్కియరాజ్ (32) అనే వ్యక్తితో పెళ్లయింది. వీళ్లిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో భవానీకి ఆన్లైన్ రమ్మీ అలవాటైంది. ఆరంభంలో డబ్బులు రావడంతో ఆటకు బానిసైన ఆమె.. బంగారం కుదువపెట్టి రూ.7.5 లక్షలు తీసుకుంది. ఆ డబ్బంతా రమ్మీ ఆటలో పోగొట్టుకుంది.
విషయం తెలిసిన భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు తిట్టిపోశారు. ఇలాంటి సమయంలో చెల్లి భారతి నుంచి రూ.1.5 లక్షలు, అక్క కవిత నుంచి రూ.1.5 లక్షలు అప్పుగా తీసుకుంది. కుదువ పెట్టిన బంగారం విడిపించుకుంటానని వాళ్లకు అబద్ధాలు చెప్పింది. ఆ డబ్బు కూడా రమ్మీలో పోగొట్టుకుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. నాలుగు రోజుల క్రితం తన సోదరికి అసలు విషయం చెప్పిన భవాని.. ఇక జన్మలో రమ్మీ ఆడనని మాటిచ్చింది.
ఆ తర్వాత ఎప్పట్లాగే కుటుంబానికి భోజనం పెట్టింది. స్నానం చేసి వస్తానని చెప్పి గదిలోకి వెళ్లింది. ఎంత సేపటికీ ఆమె రాకపోవడంతో గది తలుపులు బద్దలు కొట్టిన భర్త.. ఫ్యానుకు ఉరేసుకొని ఉన్న భార్యను చూసి కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.