తను అడిగినంత సొమ్ము ఇవ్వలేదని ప్రియుడినే కిడ్నాప్ చేయించిందో యువతి. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. డోంబివాలికి చెందిన బాధితుడు ఒక యువతితో కొంతకాలంగా వివాహేతర సంబంధంలో ఉన్నాడు. ఆమె అడిగినప్పుడల్లా ఎంతో కొంత డబ్బు ఇస్తూ వచ్చాడు. ఇటీవల మరింత పట్టుబట్టిన యువతి.. తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
దాంతో ఆమెతో రిలేషన్ వదులుకున్నాడతను. రకరకాల నెంబర్ల నుంచి ఫోన్ చేసి అతన్ని బెదిరించినా కూడా డబ్బు ఇవ్వలేదు. దీంతో కోపం తెచ్చుకున్న యువతి.. ప్రియుడి ఆఫీసుకు ఇద్దరు బౌన్సర్లను తీసుకెళ్లి అతన్ని కిడ్నాప్ చేయించింది. థానేలోని ఒక ఫ్లాట్లో బంధించింది. వారి నుంచి బయటపడిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
తనను కిడ్నాప్ చేసి ఏటీయంలో నుంచి రూ.60 వేలు విత్డ్రా చేయించారని, అలాగే తన భార్యకు సంబంధించిన రూ.2 లక్షలు విలువైన బంగారం కూడా కాజేశారని అతను ఫిర్యాదు చేశాడు. మిగతా డబ్బు మళ్లీ ఇస్తానని చెప్పి తప్పించుకున్నట్లు వివరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.