అహ్మదాబాద్ : తనతో చేసిన అభ్యంతరకర చాట్స్ను వైరల్ చేస్తానని మాజీ బాయ్ఫ్రెండ్ బెదిరించడంతో యువతి (23) బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుజరాత్లోని గాంధీనగర్లో వెలుగుచూసింది. బాధిత మహిళ గాంధీనగర్లోని ఓ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేసింది. మాజీ బాయ్ఫ్రెండ్ బెదిరింపులకు మనస్ధాపం చెందిన యువతి సోమవారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడగా శుక్రవారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
యువతి ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత ఆమె డైరీ, మొబైల్ ఫోన్ను తండ్రి చెక్ చేయగా ఈ విషయం వెల్లడైంది. నర్ధిపూర్ గ్రామానికి చెందిన రుషి పటేల్ తనతో చేసిన ప్రైవేట్ చాట్స్ను తమ ఫ్రెండ్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె తన డైరీలో రాసుకొచ్చింది. గతంలో రుషితో సన్నిహితంగా మెలిగిన ఆమె అతడి ప్రవర్తన నచ్చక దూరం పెట్టింది. మళ్లీ తనకు దగ్గర కావాలని అతడు యువతిని బెదిరిస్తున్నాడు.బాధిత యువతి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.