ముంబై : ఓ 74 ఏండ్ల వయసున్న వృద్ధుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అమెరికాలో ఉంటున్న తన కూతురికి ఫోన్ కాల్ చేసి చెప్పాడు. ఈ మాట విన్న బిడ్డ తీవ్ర ఆందోళనకు గురై తక్షణమే ముంబై పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది.
ముంబైలోని మతుంగా ఈస్ట్లో ఓ వృద్ధుడు(74) ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఆయన కుమార్తె(42) అమెరికాలోని టెక్సాస్లో ఉంటుంది. అయితే సోమవారం సాయంత్రం 5 గంటలకు తండ్రి బిడ్డకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. కుమార్తె తన తండ్రిని ప్రాణాలతో కాపాడుకోవాలని, క్షణాల్లోనే ముంబై పోలీసులకు ఫోన్ కలిపింది.
తన తండ్రి సూసైడ్ చేసుకుంటున్నాడని, ఎలాగైనా కాపాడాలని పోలీసులను ఆమె వేడుకుంది. పోలీసులు కూడా తక్షణమే స్పందించి, మతుంగా ఈస్ట్కు వెళ్లారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న వృద్ధుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.