బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని దమకూర్ గ్రామానికి చెందిన అటల్ పర్దీ, రేఖా పర్దీ (30) దంపతులు ఇటీవల బతుకుదెరువుకోసం నగరానికి వచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలుండగా వారు స్వగ్రామంలోనే ఉంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 3లోని నిర్మాణంలో ఉన్న సంస్థలో వాచ్మెన్గా అటల్ పనిలో చేరాడు. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం సమీపంలోని ఖాళీ స్థలంలోనుంచి దుర్వాసనలు వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా చెట్లపొదల్లో రాళ్లు, గడ్డిలో దాచిన రేఖా పర్ధా మృతదేహం కనిపించింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా మృతురాలు రేఖా పర్థా భర్త మూడురోజులుగా కనిపించడం లేదంటూ స్థానికులు సమాచారం ఇవ్వడంతో అతడే హత్య చేసి ఉంటాడా లేక మరేమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.