చెన్నై: కదులుతున్న కారుపై చెట్టు కూలింది. దీంతో ఆ కారును డ్రైవింగ్ చేస్తున్న మహిళ మరణించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం చెన్నైలో భారీగా వర్షం కురిసింది. అయితే 57 ఏళ్ల మహిళ సాయంత్రం తన కారులో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నది. ఆ కారును ఆమె డ్రైవ్ చేస్తుండగా అందులో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. కాగా, ఆ కారు కేకే నగర్ ప్రాంతంలోకి రాగానే నడుస్తున్న కారుపై ఉన్నట్టుండి రోడ్డు పక్కగా ఉన్న ఒక చెట్టు కూలింది. దీంతో డ్రైవింగ్ సీటులో ఉన్న 57 ఏళ్ల మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆ కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు చెన్నైలో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. దీంతో పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. వర్షాల వల్ల ట్రాఫిక్కు భారీగా అంతరాయం ఏర్పడింది.