బెంగళూరు : ఓ మహిళ అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకుంది. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం జరిగి, ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 33 ఏండ్ల వయసున్న ప్రీతి కుష్వా ఈ-కామర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త మరో ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. అయితే ప్రీతికి 11 నెలల బేబి ఉంది. మళ్లీ ఆమె ఇప్పుడు నెల తప్పింది.
దీంతో డిసెంబర్ 10వ తేదీన మెడికల్ చెకప్ చేసుకోగా, ప్రెగ్నెన్సీ పాజిటివ్గా నిర్ధారణ అయింది.
అయితే తనకు ప్రస్తుతం 11 నెలల బేబీ ఉందని, ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకుంది ప్రీతి. ఈ క్రమంలో అబార్షన్ ట్యాబ్లెట్ తీసుకురమ్మని భర్తకు చెప్పింది. కానీ అతను తిరస్కరించాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఆ ట్యాబ్లెట్ను తెప్పించుకుని వేసుకుంది ప్రీతి. అనంతరం ఆమె తీవ్ర రక్తస్రావానికి గురైంది. హాస్పిటల్కు వెళ్దామని భార్యను భర్త అడిగాడు. హాస్పిటల్కు వచ్చేందుకు ప్రీతి అంగీకరించలేదు. కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. అప్రమత్తమైన భర్త ప్రీతిని ఆస్పత్రికి తరలించగా, మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అబార్షన్ పిల్ వేసుకోవడం కారణంగానే తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయిందని ఆమె సోదరుడు పోలీసులకు తెలిపాడు. ప్రీతి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.