లండన్ : సైబర్ స్కామర్లు అమాయకులే లక్ష్యంగా ఆన్లైన్ వేదికగా అడ్డంగా (Cyber Fraud) దోచేస్తున్నారు. తాజా ఘటనలో లండన్లో నివసించే భారత మహిళను ఓ స్కామర్ డాక్టర్గా నటిస్తూ ఏకంగా రూ. 36లక్షలకు మోసం చేశాడు. ఈ ఏడాది జులైలో డేవిడ్ రోడిగర్ అనే వ్యక్తి లండన్లోని లార్డ్స్ ఆస్పత్రిలో డాక్టర్నని చెప్పుకుంటూ బాధితురాలికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. ఆపై ఆమెతో స్నేహం పెంచుకుని వివిధ అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు సూచించేవాడు.
స్వల్ప అనారోగ్యాల నుంచి ఆమెకు కొంత ఉపశమనం లభించడంతో డేవిడ్ పట్ల నమ్మకం కుదిరింది. ఇదే సమయంలో ఆమెను మోసగించేందుకు నకిలీ డాక్టర్ స్కెచ్ వేశాడు. తాను ఎంతో మంది పేద పిల్లల చదువు కోసం దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించానని, భారత్లోనూ అణగారిని వర్గాలకు చెందిన పిల్లలను ఆదుకోవాలని భావిస్తున్నానని బాధితురాలికి నమ్మబలికాడు. వారికి సాయం చేయడంలో చేయూత అందించాలని ఆమెను కోరాడు. మరోవైపు కొద్దిరోజుల తర్వాత ఛారిటీ కోసం రూ. 83 లక్షలు తనకు పంపానని డేవిడ్ చెప్పాడని బాధితురాలు పేర్కొంది.
నిందితుడు పంపిన డబ్బు కోసం వేచిచూస్తుండగా ఇమిగ్రేషన్ విభాగానికి చెందిన వారమని అంటూ పలువురు వ్యక్తుల నుంచి తనకు కాల్స్ వచ్చాయని మహిళ పేర్కొంది. బ్రిటన్ నుంచి కొరియర్లో డాలర్లు, బంగారం, ల్యాప్టాప్ ఉన్నాయని, వీటిని తీసుకునేందుకు పన్ను చెల్లించాలని వారు మహిళను కోరారు. కొరియర్ను అందుకునేందుకు వారు సూచించిన ఖాతాలకు మహిళ రూ. 36 లక్షలు పంపింది. ఆపై ఎన్ని రోజులు వేచిచూసినా పార్సిల్ అందకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారు: ఢిల్లీ మంత్రి ఆతిషి