కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన సంఘటన జిల్లాలోని సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామ శివారులో చోటు చేసుకున్నది. ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 20 నుంచి 25 ఏండ్ల మధ్య గల గుర్తు తెలియని మహిళను బుధవారం ఎక్కడో హత్య చేసి గ్రామ శివారులోని కృష్ణారెడ్డి అనే రైతు పొలం వద్దకు తీసుకొచ్చి ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి దహనం చేశారు.
గురువారం ఉదయం గమనించిన రైతులు కృష్ణారెడ్డికి తెలుపగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సగం కాలిపోయిన మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.