కామారెడ్డి : మద్యానికి బానిసైన ఓ భర్త ఆ మత్తులోనే భార్యను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా.. విచక్షణారహితంగా గొడ్డలితో నరికి చంపాడు. దారుణ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
చిట్యాలకు చెందిన సంజీవులు మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో భార్య రమ్యతో తరుచూ గొడవ పడుతున్నాడు. గురువారం ఉదయం కూడా భార్య రమ్యతో గొడవ పడ్డాడు. రమ్యపై గొడ్డలితో దాడి చేసి విచక్షణారహితంగా నరికాడు. భార్యను నరికిన గొడ్డలితోనే భర్త సంజీవులు తన తలపై నరుక్కున్నాడు. అంతటితో ఆగకుండా పొలం వద్ద ఉన్న తండ్రిపై అదే గొడ్డలితో దాడి చేసేందుకు సంజీవులు బయల్దేరాడు. సంజీవులును అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా, వారిపై కూడా దాడి చేసేందుకు యత్నించాడు. పొలం వద్దకు వెళ్తూనే గ్రామ శివారులో స్పృహ కోల్పోయి పడిపోయాడు సంజీవులు. గ్రామస్తులు అప్రమత్తమై అతన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంజీవులు మృతి చెందాడు. హత్యకు గురైన రమ్య ఐదు నెలల గర్భిణి. ఇప్పటికే ఈ దంపతులకు ఏడాదిన్నర పాప ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.