న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో పెళ్లి కోసం భర్తను భార్య హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల జీబా ఖురేషి భర్త, 47 ఏళ్ల మొయినుద్దీన్ ఖురేషీ రియల్ ఎస్టేట్ డీలర్. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే జీబా తన భర్త పట్ల చాలా అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లోని మీరట్కు చెందిన 29 ఏండ్ల షోయబ్తో ఆమెకు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు పలుమార్లు కలుసుకున్నారు. వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్తను హత్య చేసి తనను పెళ్లి చేసుకోవాలని షోయబ్పై ఆమె ఒత్తిడి తెచ్చింది.
కాగా, జీబా, షోయబ్ కలిసి ఆమె భర్త మొయినుద్దీన్ ఖురేషీని హత్య చేసేందుకు ఐదు నెలలుగా ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన 29 ఏళ్ల వినిత్ గోస్వామితో షోయబ్ రూ.6 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. జీబా తన భర్త ఎక్కడ ఉన్నాడు అన్నది వాట్సాప్ ద్వారా షోయబ్కు చెప్పేది. అతడి నుంచి సమాచారం అందుకున్న గోస్వామి, జీబా భర్త మొయినుద్దీన్ను హత్య చేసేందుకు పలుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు.
మరోవైపు తన భర్తను హత్య చేసి త్వరగా పెళ్లి చేసుకోవాలని షోయబ్ను జీబా మరింత ఒత్తిడి చేసింది. దీంతో షోయబ్, గోస్వామి ఒక ప్లాన్ వేశారు. వారిద్దరూ మీరట్కు వెళ్లి ఒక బైక్ను చోరీ చేశారు. ఒక గన్ సంపాదించి మే 17న ఢిల్లీకి రావాలని గోస్వామితో చెప్పాడు. ఆ రోజు రాత్రి 10 గంటలకు బైక్పై వారిద్దరూ జీబా భర్త మొయినుద్దీన్ ఖురేషీ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఒక స్కూల్ సమీపంలో యూరిన్కు వెళ్లిన అతడిపై తుపాకీతో గోస్వామి కాల్పులు జరిపాడు. అనంతరం చోరీ చేసిన బైక్పై వారిద్దరు పారిపోయారు. బైక్ను దర్యాగంజ్ ప్రాంతంలోని ఒక హోటల్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు.
మొయినుద్దీన్ ఖురేషీ హత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చోరీ బైక్ను గుర్తించారు. దాని ఆధారంగా జీబాతోపాటు ఆమె ప్రియుడు షోయబ్, గన్తో కాల్పులు జరిపిన వినిత్ గోస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన బైక్, నాటు తుపాకీతోపాటు రూ.3 లక్షల నగదును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. హెల్త్ సప్లిమెంట్ వ్యాపారి అయిన షోయబ్కు నాలుగేళ్ల కిందటే పెళ్లి అయ్యిందని, ఒక కుమారుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిపై మూడు నేర కేసులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.