అమరావతి : ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తపై హత్యాయత్నం చేసిన ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్ ఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియాంకనగర్ వీధికి చెందిన ఈశ్వర్ రెడ్డికి శివపార్వతితో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. చిరు వ్యాపారాలు చేసుకునే ఈశ్వర్రెడ్డి అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా అప్పుల వారి నుంచి తప్పించుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతుండేవాడు.
ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన నాగరాజుతో శివపార్వతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్న ఈశ్వర్రెడ్డి భార్యను నాగరాజుతో చూశాడు. ఈ విషయమై ఆమెతో భర్త గొడవ పడ్డాడు. ఇంతలో నాగరాజు తన ముగ్గురు స్నేహితులతోపాటు, శివపార్వతితో కలిసి ఈశ్వర్రెడ్డి పైకర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఈశ్వర్ రెడ్డిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
కోలుకున్న బాధితుడు గురువారం తన భార్య శివపార్వతి, నాగరాజుతో పాటు మరో ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.